నిత్యావసర వస్తువులు... కొనాలన్నా, వాడుకోవాలన్నా కూడా భయపడే పరిస్థితి. భారీ వర్షాలతో కూరగాయాలు కోయకుండానే గాయం చేస్తున్నాయి. కిలో టమాటా ఏకంగా వంద నుంచి 150 రూపాయలు పలుకుతోంది. ఇక సరుకుల ధరలు అయితే... సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా... ఇప్పుడు సామాన్యుల నెత్తిపై మరో పిడుగు పడుతోంది. సబ్బులు, డిటర్జెంట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చమురు ధరల ప్రభావం... నిత్యావసర వస్తువుల ధరలపై పడింది. ఓ వైపు పెట్రోల్, డీజీల్ ధరలు, మరోవైపు ముడి సరుకు, నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడంతో సబ్బులు, డిటర్జెంట్ ధరలు పెంచుతున్నట్లు ప్రముఖ సంస్థలు ప్రకటించాయి. సబ్బుల తయారీలో సింహభాగం వాటా హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటీసీ లిమిటెట్ సంస్థలదే. ప్రస్తుతం ఈ రెండు సంస్థలో సబ్బులు, డిటర్జెంట్ ధరలు  పెంచుతున్నట్లు ప్రకటించాయి. కన్స్యూమర్ గూడ్స్ తయారీలో ఈ రెండు సంస్థలదే మెజారిటీ వాటా. ప్రస్తుతం ఇన్ పుట్ ఖర్చులు గణనీయంగా పెరిగినందు వల్లే సబ్బుల ధరలను పెంచినట్లు సంస్థలు ప్రకటించాయి.

హెచ్‌యూఎల్, ఐటీసీ సంస్థల ప్రకటనతో సామాన్యుల నెల వారీ బడ్జెట్ భారీగా పెరగనుంది. హెచ్‌యూఎల్ సంస్థ తమ సంస్థ తయారూ చేసే వీల్ డిటర్జెంట్ పౌడర్ ధరను కిలోపై 5 శాతం పెంచేసింది. ఇక ప్రతి ఇంట్లో ఉండే రిన్ బార్ ధర కూడా 500 గ్రాముల ధర 10 శాతం పైగానే పెరిగింది. ఇక లక్స్ సబ్బు అయితే ఏకంగా 22 శాతం పెంచుతున్నట్లు హెచ్‌యూఎల్ సంస్థ ప్రకటించింది. ఐటీసీ సంస్థ కూడా తమ ఉత్పత్తులును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇన్ పుట్ ఖర్చుల భారం సంస్థ నిర్వహణపై ప్రభావం చూపుతున్నాయన్నారు ఐటీసీ అధికారులు. ఎంపిక చేసిన వస్తువులపై మాత్రమే కొత్త ధరల పెంపు ప్రభావం ఉంటుందన్నారు. ఐటీసీ సంస్థ నుంచి ఫియామా సబ్బు, వివెల్ డిటర్జెంట్, ఎంగేజ్ డియోడరెంట్, ఎంగేజ్ పెర్ఫ్యూమ్ ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలను 6 శాతం నుంచి 12 శాతం పెంచుతున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. దిగుమతి సుంకం పెరగడం, చమురు ధరల కారణంగానే వీటి ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: