తాజాగా ఐహెచ్ఎస్ నివేదిక ప్రకారం.. 2021లో 2.7 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న భారత జీడీపీ 2030 వరకు 8.4 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చు. ఈ వేగవంతమైన వృద్ధి కారణంగా జపాన్ జీడీపీ అధిగమించి ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో రెండవ స్థానంలోకి వెళ్లవచ్చు. 2030 వరకు అతిపెద్ద పశ్చిమ ఐరాపా ఆర్థిక వ్యవస్థలు అయినా జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ లను సైతం భారత ఆర్థిక వ్యవస్థ అధిగమించొచ్చు. మొత్తం మీద వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా భారత్ కొనసాగుతుంది. వినియోగదారుల వ్యయాలు పెరిగేందుకు భారత్లోని పెద్ద, వేగవంతమైన మధ్యతరగతి భారత్ కు అతిముఖ్యమైన సానుకూల అంశంగా మారుతుంది.
2020లో 1.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న వినియోగదారుల వ్యయాలు 2030 వరకు రెట్టింపు అయి 3 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చు. పూర్తి ఆర్థిక సంవత్సరం 2021-22 లో భారత వాస్తవ జీడీపీ 8.2 శాతం నమోదు కావచ్చు అని అంచనా వేసారు. 2022-23 లో 6.7 శాతం మేరకు బలంగా వృద్ధి కొనసాగించొచ్చు. ముఖ్యంగా భారత్లో డిజిటల్ మార్పుల వల్ల ఈ-కామర్స్ వేగంగా వృద్ధి చెందవచ్చు వచ్చే దశాబ్దంలో రిటైల్ వినియోగదారు రంగమే సమూలంగా మారొచ్చు. 2030 వరకు 110 కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్ను వినియోగించవచ్చు. ప్రస్తుతం 50 కోట్ల మందితో పోల్చితే ఇది రెట్టింపు అవుతుంది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెరుగుదల భారత్ను మారుస్తున్నది. గూగుల్, ఫేస్బుక్ వంటివి భారత్కు నిధులతో తరలివస్తున్నాయి. వాహన, ఎలక్ట్రానిక్, రసాయనాలు, బ్యాంకింగ్, భీమా, అసెట్ మేనేజ్మెంట్, ఆరోగ్య సంరక్షణ, ఐటీ వంటి రంగాలలో బహుళజాతి కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తుండటం వల్ల భారత్ భవిష్యత్ బలంగా కనిపిస్తోంది.