మొన్నటి వరకు మంచి ఊపులో ఉన్న స్టాక్ మార్కెట్ ఒక్కసారే కుప్పకూలింది. స్టాక్ మార్కెట్పై కేంద్ర బడ్జెట్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బడ్జెట్ మార్కెట్ను మెప్పించడంలో విఫలమవడంతో మదుపుదారులు అమ్మకాలకు తెగబడ్డారు. కేంద్ర బడ్జెట్ ప్రతికూలతలు, ఆసియా మార్కెట్లు బలహీన సంకేతాలతో దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి.
దీనికి తోడు కంపెనీల ఏప్రిల్—జూన్ త్రైమాసిక ఫలితాలపై దృష్టిపెట్టి మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. విదేశీ ఇన్వెస్టర్లకు దీర్ఘకాల మూలధన రాబడిపై పన్నును పెంచడం ఎఫ్పీఐలను తీవ్ర నిరాశకు లోనుచేసిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఫలితంగా నేటి ట్రేడింగ్ ఆరంభంలోనే సూచీలు కుప్పకూలాయి.
మార్కెట్ ఆరంభంలో 400 పాయింట్లకు పైగా పతనమైన బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్ .. ప్రస్తుతం 6 వందల పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడవుతోంది. అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ సెన్సెక్స్ 700 పాయింట్ల నష్టంతో 38,816 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ 215 పాయింట్ల నష్టంతో 11,595 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. గత రెండు సెషన్లలో స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలతో మదుపుదారుల సంపద రూ 5 లక్షల కోట్ల మేర ఆవిరైంది. అటు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 190కి పైగా పాయింట్ల నష్టాల్లో కొనసాగుతోంది. ఆటో మొబైల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.