ఒలింపిక్స్‌లో అథ్లెట్ కన్నా పసిడి ధర వేగంగా పరుగెడుతోంది. ఆల్‌టైమ్‌ రికార్డు చేరి.. కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది. 40 వేల రూపాయల మార్క్‌పైకి చేరి బెంబేలెత్తిస్తోంది. అగ్ర రాజ్యాల ట్రేడ్‌వార్‌.. ఆర్థిక మాంద్యం దెబ్బకి బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రానున్న రోజుల్లో పసిడి మరింత పెరిగే ఛాన్స్‌ ఉందంటున్నారు మార్కెట్‌ నిపుణులు. వెండి ధర కూడా పసిడి బాటలోనే పయనిస్తోంది.


పసిడి పరుగులు ఆగడం లేదు. ఆల్‌టైం రికార్డ్‌కి చేరింది బంగారం ధర.  దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పది గ్రాముల పసిడి 40 వేల రూపాయలు దాటింది. హైదరాబాద్‌లోనూ  24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 40 వేలకు చేరింది. అమెరికా- చైనా ట్రేడ్‌వార్‌ బంగారం ధర పెరగడంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. వాణిజ్య యుద్ధాలు, ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితి కొనసాగితే బంగారం ధరలు కొద్ది నెలల్లోనే 42 వేలకు చేరే అవకాశం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. దీపావళి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.


అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల వల్ల... అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్  జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకుంది. ఈ డిమాండ్‌తో  పసిడి ధరకు రెక్కలొచ్చాయి. కరెన్సీ రూపంలో పెట్టుబడులు పెడితే ఆర్థిక మాంద్యం వస్తే తీవ్రంగా నష్టపోతామని భయపడుతున్న ఇన్వెస్టర్లు.. బంగారం రూపంలో పెట్టుబడి పెడుతున్నారు. దీంతో ధరలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. రూపాయి బలపడుతుండటం కూడా బంగారం ధర పెరగడానికి కారణం అవుతోంది. మరోవైపు బంగారం ధరలు భారీగా పెరగడంతో అమ్మకాలు పడిపోయాయని.. పాత బంగారం రీసైక్లింగ్‌ పెరిగిందని ముంబై వ్యాపారులు వాపోతున్నారు.


ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు  బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా భారీస్థాయిలో బంగారం కొంటోందని పలు సర్వేలు చెబుతున్నాయి. వచ్చే రెండు నెలల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉంది.  మరోవైపు పసిడి బాటలోనే పయనిస్తోంది వెండి ధర. కిలో వెండి ధర 45 రూపాయలు  పెరిగి 47 వేల 845కు చేరింది. పసిడి ధరలు పైపైకి ఎగబాకినా.. పండుగ సీజన్‌తో పాటు వచ్చే పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్‌పై పెద్దగా ప్రభావం ఉండదని అంచనా వేస్తున్నారు మార్కెట్‌ నిపుణులు.



మరింత సమాచారం తెలుసుకోండి: