పల్లెలు, పట్టణాల్లో సంక్రాంతి పండుగ శోభ నెలకొంది. ఇప్పటికే ఇళ్లల్లో బంధువులతో.. ఘుమ ఘుమలాడే వంటకాలతో ముక్కు పుటాలు అదిరిపోయేలా వాసన వస్తుంటాయి. కమ్మనైనా స్వీట్స్, కారంకారంగా ఉండే స్పైసీ వంటకాలను సిద్ధం చేస్తున్నారు. రకరకాల వంటకాలతో ఇంటిళ్లిపాది సువాసనలు వెదజల్లుతుంటాయి. పండుగ వస్తుందంటే ఇంట్లో ఆడవాళ్లు వారం రోజుల నుంచే ఏం వండుకోవాలి, ఎలాంటి వంటలు వండాలని ప్లాన్ చేస్తుంటారు. ఇంట్లో వాళ్లకు ఏం వండి పెడితే.. ఇష్టంగా తింటారని తెగ టెన్షన్ పడుతుంటారు. అలాంటి వారి కోసం రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే పిండి వంటల గురించి చెప్పబోతున్నాము. మీ ఇంట్లో కూడా ఈ పిండి వంటలను వండి.. సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేయండి.

సకినాలు:
ముందుగా బాగా కడిగిన బియ్యాన్ని ఒక బౌల్‌లో నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత బయట క్లాత్‌పై గంటపాటు ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత మిక్సిలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, నువ్వులు, వాము, జీలకర్ర, నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత సకినాలు షేపులో వేసుకుని కొంచెం సేపు ఆరబెట్టాలి. కొంచెం ఆరిన తర్వాత ఆయిల్‌లో వేయించుకోవాలి. క్రిస్పీగా ఉండే సకినాలు రెడీ.

నువ్వుల ఉండలు:
నువ్వుల్లో కాల్షియం ఎక్కువ. నువ్వులు తింటే ఎముకలు స్ట్రాంగ్‌ అవుతాయి. ఒక కప్పు నువ్వు, ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. స్టవ్‌పై ప్యాన్‌లో నువ్వులను బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత బయటకు తీసుకోవాలి. వేరో ప్యాన్‌లో 2 టీస్పూన్ నెయ్యి తీసుకుని, అందులో బెల్లం వేసుకుని కరిగించాలి. ఆ తర్వాత అందులో అర టీస్పూన్ యాలాకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక.. వేయించిన నువ్వులు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని ప్లేట్‌లో తీసుకుని 5 నిమిషాల తర్వాత చేతికి నెయ్యి రాసుకుని లడ్డు షేప్‌లో చేసుకోవాలి.

జంతికలు:
ప్రతి పండుగ స్పెషల్ వంటకం జంతికలు. ఒక బౌల్‌లో రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. ఇందులోనే ముప్పావు కప్పు శనగ పిండిని వేసుకోవాలి. వాము, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకుని కలుపుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత జంతికల గొట్టాన్ని తీసుకుని జంతికలు తయారు చేసుకోవాలి. ఆ తర్వాత వేడి నూనెలో వేయించుకోవాలి. పండుగ వేళ మీరు కూడా ఇంట్లో ఈ పిండి వంటలను ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: