సింగరాయకొండ రోడ్డులో రవి కిశోర్ గత కొద్దిరోజులుగా గోల్డ్ షాప్ నడుపుతున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి వస్తున్నానని చెప్పేందుకు ఫోన్ చేశాడు. అయితే భార్య గానీ, కుమార్తె గానీ ఫోన్ తీయలేదు. ఏదో పనిలో ఉంటారులే అనుకోని ఇంటికి వెళ్లి చూసిన రవి కిషోర్ కు ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యింది. ఇంటి హాల్ లో కుమార్తె రక్తపు మడుగులో పడిఉంది. భార్య కోసం వెతకగా బెడ్ రూంలో ఆమె కూడా మృతి చెంది పడి ఉంది. దీంతో ఒక్కసారిగా కేకలు వేస్తూ రవి కిషోర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ ఇంటికి సమీపంలోనే ఉండే పోలీసు స్టేషన్ కు వెళ్లి జరిగిందంతా చెప్పారు. వెంటనే క్లూస్ టీం రంగంలోకి దిగి వివరాలు సేకరించింది.
అయితే ఈ హత్యలపై పోలీసులు పలు కోణాల్లో విచారణ ప్రారంభించారు. తల్లీ కూతుళ్లను ఇంత దారుణంగా, కిరాతకంగా ఎందుకు చంపాల్సి వచ్చిందో, అసలు ఎవరికి ఆ అవసరం ఉందో ఆరా తీస్తున్నారు. ఇటీవలే రవి కిశోర్ తమ్ముడు రంగాకు చెందిన బంగారు దుకాణంలోనూ చోరీ జరిగింది. ఆ కేసు కూడా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇప్పుడు తాజాగా జరిగిన హత్యలకు, గతంలో జరిగిన దోపిడీకి, ఏవైనా సంబంధాలు ఉన్నాయేమోనని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో జరిగిన దోపిడీ జరిగిన తీరును.. ఆ కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను కూడా పిలిపించి వివరాలను తీసుకున్నారు. గతంలో దోపిడీ జరిగిన సమయంలో ఏమైనా ఆధారాలు దొరికాయేమోనని లోతుగా విచారణ చేస్తున్నారు.