విశాఖ ఆర్కే బీచ్ లో మిస్ అయిన సాయిప్రియ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె తల్లిదండ్రులకు తాను పెళ్లి చేసుకున్న ఫొటోలను, ఆడియో క్లిప్ లను వాట్సప్ చేసింది. తాను బతకాలని అనుకుంటున్నానని, తనకోసం వెతకొద్దని తల్లిదండ్రుల్ని ప్రాథేయపడింది. తనతోపాటు వచ్చిన స్నేహితుడ్ని రెండో పెళ్లి చేసుకున్నట్టు ఫొటోలు కూడా పంపించింది. దీంతో ఆమె బెంగళూరులో ఉన్నట్టు నిర్థారణ అయింది.

విశాఖ టు నెల్లూరు.. అక్కడినుంచి బెంగళూరు..
విశాఖ పట్నం ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో రోజుకో ట్విస్ట్‌ వెలుగు చూశాయి. పెళ్లిరోజు భర్తతో కలసి ఆర్కే బీచ్ కి వచ్చిన ఆమె, భర్త కళ్లుగప్పి స్నేహితుడితో వెళ్లిపోయింది. అలా వారిద్దరూ నెల్లూరుకు వచ్చినట్టు గుర్తించారు. నెల్లూరులో ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారనే సమాచారం తెలుసుకునేలోగా వారు బెంగళూరు వెళ్లిపోయారు. అక్కడ పెళ్లి చేసుకుని ఫొటోలను కుటుంబ సభ్యులకు పంపించారు.

2020లో శ్రీనివాస్, సాయిప్రియ ఇద్దరికీ వివాహం అయింది. శ్రీనివాస్ హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, సాయిప్రియ విశాఖలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈనెల 25న పెళ్లిరోజు కోసం భర్త శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి రాగా... దంపతులిద్దరూ విశాఖ ఆర్కే బీచ్ లో సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ భర్త సెల్ ఫోన్ చూస్తుండగా, భార్య మాయమైంది. ఆమె ఎక్కడికి వెళ్లిందోనని భర్త భయపడ్డాడు. చివరకు సముద్రంలో మునిగిపోయిందేమోనన్న అనుమానంతో అధికారులకు చెప్పగా వారంతా గాలించారు. నేవీ హెలికాప్టర్లు సైతం తెప్పించి గాలించారు. కానీ దొరకలేదు. ఆ తర్వాత మెసేజ్ ల ద్వారా తాను నెల్లూరులో ఉన్నానని, ఇప్పుడు బెంగళూరులో ఉన్నానని చెప్పుకొచ్చింది సాయిప్రియ.

తన స్నేహితుడిని రెండో పెళ్లి చేసుకున్నానని, తనకోసం వెతకొద్దని చెబుతోంది. అదే సమయంలో విశాఖలోని అధికారులకు తాను శ్రమ కలిగించానని అందుకు సారీ కూడా చెప్పింది. సాయి ప్రియ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎప్పుడు తిరిగొస్తుందో చూడాలి. మొత్తమ్మీద ఈ కేసు వ్యవహారంతో విశాఖ పోలీసులు హడావిడి పడ్డారు. ఇటు నెల్లూరు పోలీసులు కూడా సమాచారం తెలుసుకునేందుకు శ్రమించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: