మేము చోరీలకు పాల్పడిన మాట వాస్తవమే.. కానీ మా ముఠా లో ఐదు మంది ఉంటే మా ఇద్దరిని పట్టుకుంటే ఎలా.. మిగతా ముగ్గురిని కూడా తీసుకువచ్చి ఒకేసారి పోలీసులకు పట్టించండి అంటూ డిమాండ్ చేయడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈ ఘటన నిజాంబాద్ జిల్లా లో వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి. నిజాంబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామం లో కొంతకాలం వరుస చోరీలు జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన ముగ్గురు నిజాంబాద్ నగరానికి చెందిన మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు.
ఈ క్రమం లోనే గ్రామస్థులు పథకం ప్రకారం ఈ దొంగలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గ్రామ చావిడి లో విచారించగా మొత్తం ఐదుగురు కలిసి చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. అయితే తమ ఇద్దర్ని పట్టుకుంటే సరి పోదని.. మిగతా ముగ్గురిని కూడా పట్టుకోవాలని దొంగలు చెప్పారు అని స్థానికులు అంటున్నారు. అయితే దొంగలను పోలీసులకు పట్టించినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు చెబుతుండడం గమనార్హం. ఇకనైనా పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.