సాధారణంగా పెళ్లి అంటే కళ్యాణ మండపం మొత్తం నిండిపోయిన బంధుమిత్రులు.. బాజా భజంత్రీల వాయిధ్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే పెళ్లి మండపంలో ఉండే సందడి అంతా ఇంతా కాదు అని చెప్పాలి. అయితే ఇలా సందడిగా నెలకొన్న వాతావరణం లో వధూవరులు ఇద్దరు కూడా మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం చిత్ర విచిత్రమైన కారణాలతో మరికొన్ని నిమిషాల్లో జరగాల్సిన పెళ్లికూడా చివరికి ఆగిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సినిమాల్లో చూపించినట్లుగా కాదు అంతకుమించి అనే రేంజ్ లోనే నిజజీవితంలో కూడా అప్పుడప్పుడు ఘటనలు జరుగుతూ ఉంటాయి.


 ఇక్కడ జరిగిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి వస్తుంది అని చెప్పాలి. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి జరగాల్సి ఉంది ఇలాంటి సమయంలో వరుడు చేసిన పని కాస్త చివరికి పెళ్లి ఆగిపోవడానికి కారణం అయ్యింది అని చెప్పాలి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఒక జంటకు పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లికొడుకు కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా వెళ్లి వేదిక వద్దకు వెళ్లాడు. ఇక వధూవరులు ఇద్దరు కూడా పెళ్లి దండలు మార్చుకున్నారు. ఈ క్రమంలోనే వధువు ఒక గదిలో వరుడు మరో గదిలో ఉన్నారు.


 పాపం వరుడు పెళ్లికూతురు ముస్తాబైన తీరుని చూసి ఫిదా అయ్యాడో ఏమో.. అతనికి ఇక పెళ్లికూతురుని పదేపదే చూడాలి అనిపించింది. ఈ క్రమంలోనే ఆమె గదిలోకి పదేపదే వెళ్లడం మొదలుపెట్టాడు. మరికాసేపట్లో వివాహం జరుగుతుంది. ఆ పెళ్లికూతురు ఇక తన భార్య కాబోతుంది అన్న విషయాన్ని మరిచిపోయి.. ఇక ఇలా విచిత్రంగా ప్రవర్తించాడు వరుడు. అయితే ఇదంతా చూసిన పెళ్లికూతురు తండ్రి వద్దని వారించాడు. అయితే పెళ్లికొడుకు మాత్రం మాట వినలేదు. దీంతో ఆగ్రహం పట్టలేకపోయిన వధువు తండ్రి వరుడు చెంప చెల్లుమనిపించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన పెళ్లి కొడుకు కూడా తిరిగి వధువు తండ్రిపై చేయి చేసుకున్నాడు. దీంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. చివరికి అతనితో పెళ్లి వద్దు అంటూ వధువు చెప్పడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: