కావల్సిన పదార్థాలు:
మటన్ - అరకేజి,
బంగాళదుంపలు - 4,
అల్లం పేస్టు - 2 టేబుల్స్పూన్లు,
పచ్చిమిర్చి - 3,
పెరుగు - 5 టేబుల్స్పూన్లు,
పసుపు - 1/2 స్పూను,
జీలకర్ర పొడి - టేబుల్ స్పూను,
యాలకుల పొడి - టేబుల్స్పూను,
కాశ్మీరి చిల్లీపౌడర్ - టేబుల్ స్పూను,
ధనియాల పొడి - టేబుల్ స్పూను,
దాల్చినచెక్క పొడి - టేబుల్ స్పూను,
నూనె - 3 టేబుల్ స్పూన్లు,
ఉప్పు - రుచికి తగినంత,
నీరు - 4 కప్పులు,
బిర్యానీ ఆకులు - 2,
దాల్చినచెక్క - 1,
లవంగాలు - 5,
తయారుచేసే విధానం :
ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి, పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకుని మటన్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసి పావుగంటసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు, అల్లం పేస్టు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, దాల్చినచెక్క పొడి, యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ముందుగా ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్న మటన్కు ఈ పెరుగు మిశ్రమమూ వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని గంటన్నర పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా నీటిని పోసి, బంగాళదుంపల్ని వేసుకుని 3, 4 విజిల్స్ వచ్చేవరకూ ఉడికించుకొని, పక్కన పెట్టుకోవాలి. అలాగే కుక్కర్లో పెరుగు కలిపి పెట్టుకున్న మటన్ని వేసి నాలుగైదు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకుని, నూనె వేసి వేడెక్కాక బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చినచెక్క వేసి, వేయించుకోవాలి.
అలాగే ఉడికించుకున్న మటన్ని కూడా వేసి, మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని కట్ చేసి అందులో వేసుకొని మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. అంతే ఎంతో సులువుగా టేస్టీ టేస్టీ బంగాళదుంప మటన్ కర్రీ రెడీ..!