కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో.. నిత్యవసర వస్తువులు మినహా.. మిగిలిన అన్ని వ్యాపారాలు బంద్ అయ్యాయి. ఈ క్రమంలోనే మద్యం షాపులు కూడా మూతపడడంతో.. మందుబాబుల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ కిక్కులో ఉండే మందుబాబులకు చుక్క మందు దొరక్క పిచ్చెక్కిపోయారు. అయితే భారత్లో మూడో దశ లాక్డౌన్ అమలవుతుండంగా.. కేంద్రం మద్యం షాపులకు మినహాయింపు ఇచ్చింది. దీంతో మద్యం ప్రియులకు ప్రాణం లేచొచ్చినట్టు అయింది. లాక్డౌన్ కారణంగా 40 రోజులుగా మూతపడి ఉన్న వైన్షాపులు పలు రాష్ట్రాల్లో తెరుచుకోగా.. మందుబాబులు వైన్ షాపుల ముందు క్యూ కట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్ షాపులన్నీ కళకళలాడుతున్నాయి. తెలంగాణలోనూ మద్యంప్రియులకు గుడ్ న్యూస్ అందిస్తూ.. మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. రాష్ట్రంలో కంటెయిన్మెంట్ జోన్లు మినహా మిగిలిన జోన్ల పరిధిలో బుధవారం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. దీంతో మందు బాబుల ఆనందానికి హద్దే లేకుండా పోతోంది. దాదాపు నలబై రోజులుగా తరువాత మద్యం అభిస్తుండటంతో మద్యం షాపుల వద్ద పండగ వాతావరణం నెలకొంది. అయితే ఈ క్రమంలోనే కొన్ని దారుణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఫుల్గా తాగేసి.. ఆ మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా అర్థంకాని పరిస్థితి.
ఇక తాజాగా హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలానగర్ కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి బాగా తాగి భార్యతో వాగ్వాదానికి దిగాడు. లాక్డౌన్ సమయంలో ఎందుకు మందు కొన్నావని భార్య ప్రశ్నించడంతో ప్రసాద్ తీవ్రంగా ఆగ్రహించారు. ఈ క్రమంలోనే తాగిన మైకంలో ఉన్న ప్రసాద్ ఏకంగా శరీరాన్ని బ్లేడుతో కోసుకోవడం మొదలుపెట్టాడు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. భార్యభర్తల గొడవలో జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. అనంతరం ప్రసాద్ను హాస్పటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రసాద్ ఆరోగ్యం బాగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.