నేటి స‌మాజంలో అడ‌వారిపై జ‌రుగుతున్న అత్యాచారాల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌డం లేదు. కామాంధుల ఆకృత్యాలకు ఎందరో అమ్మాయిలు బలైపోతున్నారు.  ఈ క్ర‌మంలోనే రోజురోజుకు ఇలాంటి కేసులు పెరుగుతున్నాయే త‌ప్పా.. త‌ర‌గ‌డం లేదు. మహిళలను ఆకాశంలో సగం.. సమాజంలో సగం అంటూ అనేక మాటలు చెప్పినా.. వారు శారీరకంగా, మానసికంగా నిరంతరం వేధింపులకు గురవుతూనే ఉన్నారు. జంతువులకూ మనిషికి తేడా లేకుండా కొంద‌రు కామాంధులు కామ దాహంతో ఆడ‌వారిపై రెచ్చిపోతున్నారు. నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా.. అత్యాచార ఘటనలు లేకుండా ఒక్క రోజైనా గడవటం లేదు. 

 

అయితే తాజాగా ఓ యువకుడు అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. దీంతో సదరు యువకుడిని పోలీసులకు అప్పగించి శిక్షించాల్సింది పోయి.. పెద్ద మనుషుల సమక్షంలో దారుణంగా ఆ అమ్మాయి కన్యత్వానికి విలువ కట్టారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ తండాకు చెందిన అబ్బాయి, సమీప గ్రామంలోని ఓ అమ్మాయిపై ఇటీవల అఘాయిత్యానికి యత్నించాడు. దీంతో స‌ద‌రు అమ్మాయి కుటుంబ సభ్యులు పెద్ద మనుషులకు ఫిర్యాదు చేయగా.. అబ్బాయి కుటుంబ సభ్యులను పిలిపించి పంచాయతీ నిర్వహించారు. 

 

ఈ క్ర‌మంలోనే అబ్బాయి చేసిన తప్పుకు పోలీసుల‌కు అప్ప‌చెప్ప‌కుండా.. రూ.2లక్షలు జరిమానా విధించి చేతులు దులుపుకున్నారు. మరీ ఆ డబ్బు అయిన బాధిత కుటుంబానికి దక్కిందా అంటే అదీ లేదు. అబ్బాయి చెల్లించిన నగదులో నయా పైసా బాధిత కుటుంబానికి ఇవ్వకుండా పెద్ద మనుషులే దారుణంగా నొక్కేవారు. ఇదేంటని నిలదీసినందుకు.. ఆ అమ్మాయి కుటుంబాన్నే దబాయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం తల్లడిల్లుతోంది. ఇక‌ బాధిత కుటుంబానికి పైసా కూడా చెల్లించకుండా వ్యవహరించిన పెద్దమనుషుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో.. అమ్మాయి శీలానికి వెల‌క‌ట్టిన స‌ద‌రు పెద్ద‌మ‌నుషుల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: