డబ్బుకు లోకం దాసోహం అనే సామేత ఊరికే పుట్టలేదనిపిస్తుంది. నేటికాలంలో సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలను చూస్తుంటే.. మనిషి డబ్బుకోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నాడు.. చివరికి మానవ సంబంధాలను కూడా మంట కలిపేస్తున్నాడు.. కన్నవారు, కట్టుకున్నవారు, తోబుట్టువులు అని ఇలాంటివి బలహీనతలుగా భావించి, అన్నీటికి చితిపెట్టేస్తున్నాడు.. అలాంటి ఘటనే ఒకటి జరిగింది.. అతని ఉద్యోగం కోసం, కట్టుకున్న భార్య, కన్నకొడుకులతో కలిసి నిర్ధాక్షిణ్యంగా అతన్ని చంపేసింది.. ఆ వివరాలు చూస్తే.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
కొత్తూరు గ్రామానికి చెందిన ముత్కల నర్సయ్య(58) గోదావరిఖనిలో సింగరేణి సంస్థలో పంపు ఆపరేటర్గా పనిచేస్తున్నారు. కాగా ఆయనకు భార్య తార, ఇద్దరు కుమారులు తిరుపతి(35), రాకేష్(32) ఉన్నారు. ఇతను చేస్తున్న ఉద్యోగాన్ని గతంలో పెద్ద కుమారునికి పెట్టించేందుకు ప్రయత్నించగా అది విఫలం అవడంతో ఇతనే ఆ ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నాడు.. ఈ క్రమంలో ఇతను రిటైర్మెంట్కు కూడా దగ్గర అయ్యాడు.. ఈ దశలో కుటుంబ సభ్యులంతా కలిసి ఆయనను పథకం హతమార్చి గుండెపోటుతో చనిపోయాడంటూ అందర్ని నమ్మించారు.
ఇక ఈ సమయంలో మృతుడి ఉద్యోగానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు ఎఫ్ఐఆర్ అవసరం కావడంతో తిరుపతి గత నెల 27న ధర్మారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసిన ఎస్సై ప్రేమ్కుమార్ విచారణ నిమిత్తం వెంటనే గ్రామానికి వెళ్లి చితిపై ఉన్న నర్సయ్య మృతదేహాన్ని పరిశీలించగా అది అనుమానస్పద మరణంగా అనిపించడంతో పోస్టుమార్టం చేయించారు.
గొంతు నులమడం వల్లనే నర్సయ్య మృతిచెందినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఇక కుటుంబ సభ్యులను విచారించగా, కారుణ్య నియామకం కోసం కుటుంబ సభ్యుల అంగీకారంతోనే తండ్రిని హత్య చేసినట్లు తిరుపతి అంగీకరించాడు. కాగా నిందితులు తిరుపతి, రాకేష్లను శనివారం అరెస్టు చేసి, పరారిలో ఉన్న ఇతని భార్య కోసం వెతుకుతున్నారట..