సమాజంలో రోజు రోజుకు సోషల్ మీడియా ప్రేమాయణాలు.. అక్రమ సంబంధాలు.. మర్డర్లు పెరిగి పోతున్నాయి. ఇక టిక్ టాక్తో ఎంతో మంది యువతీ, యువకులు, ఆంటీలు దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్య అక్రమ సంబంధాలు ఏర్పడుతున్నాయి. చివరకు అప్పటికే వీళ్లకు వేరే యువతీ యువకులతో పెళ్లి అయ్యి ఉన్నా కూడా వారు తమ కుటుంబాలను మరచిపోయి మరీ సోషల్ మీడియాలో పరిచయం అయిన వారికి దగ్గరవుతున్నారు. చివరకు వీళ్లు ఒకరిని మించి మరొకరు ఉండలేని పరిస్థితి వచ్చేసింది.
తాజాగా టిక్టాక్ ప్రేమాయణం ఓ యువకుడి ప్రాణం బలితీసుకుంది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం నగర శివారులోని పిల్లిగుండ్లకాలనీకి చెందిన ఈడిగ ముత్యాలప్ప (21).. వితంతువుతో ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదన్న మనస్తాపంతో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడికి మూడు నెలల క్రితం డోన్కు చెందిన ఓ వితంతువుతో టిక్ టాక్ ద్వారా ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో వీరిద్దరు వివాహం చేసుకోవాలని భావించారు. ఈక్రమంలో ఆమెను ముత్యాలప్ప రెండు రోజుల కిందట తన తల్లిదండ్రుల వద్దకు తీసుకువచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
అయితే అందుకు అతడి తల్లిదండ్రులు అంగీకరించ లేదు. దీంతో తన ప్రియురాలు తనకు దక్కదని... ఆమె లేని జీవితం వ్యర్థం అని భావించి రూరల్ మండలంలోని ధర్మబిక్షంకాలనీ సమీపాన గల వేపచెట్టుకు ఉరేసుకుని, మరణించాడు. గమనించిన స్థానికులు.. రూరల్ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా సోషల్ మీడియా పరిచయాలు, ప్రేమలు, అక్రమ సంబంధాలు ఎంత వరకు వెళతాయన్న దానికి ఇదే నిదర్శనం.