ఆడపిల్లలకైతే రూ.60 వేలు, మగపిల్లడికైతే రూ.1.50 లక్షలుగా బేరాలు ఆడుతున్నారు. ఈ ఘోరం ముంబాయి నడిబొడ్డున జరుగుతోంది. అక్కడ పేద ప్రజలను, ఫుట్ పాత్ లపై నివసించే వారినే టార్గెట్ చేసింది ఓ ముఠా. గుట్టుచప్పుడు కాకుండా పిల్లల తల్లిదండ్రులతో బేరాలు ఆడుతూ నెలల పిల్లలను కొంటున్నారు. అనుకోకుండా ఈ ముఠాలోని మహిళ పోలీసులకు పట్టుబడటంతో వీరి ఆగడాలన్నీ బయటకొచ్చాయి. రూపాలి వెర్మ అనే మహిళ సాయంతో రూక్షర్ తన ఆడబిడ్డను అమ్మేసింది. ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. అమ్మిన పాపను శిశు సంరక్షణ కేంద్రానికి తరలించి రూపాలి వెర్మను విచారించారు.
ఈ విచారణలో ఆమె చెప్పిన మాటలు విని పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ ముఠాను 8 మంది నడుపుతున్నట్టు ఆ మహిళ తెలిపింది. విచిత్రం ఏమిటంటే ఆ ముఠాలో ఆరుగురు మహిళలే ఉన్నారు. వీరంతా పేదరికంలో మగ్గి గర్భవతులైన వారినే టార్గెట్ చేసి బేరమాడతారని వెళ్లిడించింది ఆ మహిళ. ఆరునెలల నుంచి ఇలా చేస్తూ నలుగురు పిల్లలను కొని వారిని ధనవంతులకు, పిల్లలు లేని వారికి అమ్మేసినట్టు ఆమె తెలిపింది. ఈ గ్రూపులో ఉన్న మిగతా సభ్యుల వివరాలను కూడా ఆమె తెలిపింది. ఈ ముఠా లోని వ్యక్తులపై అక్రమ రవాణా కింద కేసు నమోదు చేసుకుని కటకటాలకు తరలించారు పోలీసులు.