ఎవరికైనా థాయిలాండ్ దేశం పేరు చెప్పగానే వెంటనే గుర్తుకొచ్చేవి అందమైన సముద్ర తీర ప్రాంతాలు, అలాగే అంగట్లో ఉండే రకరకాల దుఖానాలు వాటితో పాటు మరీ ముఖ్యంగా రకరకాల ఆయిల్లతో చేసే మసాజ్లు... కానీ తాజాగా ఆ దేశ న్యాయస్థానం విధించిన శిక్ష గురించి తెలుసుకుంటే మాత్రం అందరూ షాక్ అవుతారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... ఆ థాయిలాండ్ దేశాధినేతపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించినందుకు ఓ మాజీ ప్రభుత్వోద్వోగినికి అక్కడి న్యాయస్థానం ఏకంగా 43 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఆ దేశపు రాజు గురించి అవమానకరంగా మాట్లాడిన మహిళకు తొలుత 87 ఏళ్ల శిక్షణను విధించగా.. ఆమె తన నేరాన్ని అంగీకరించడంతో సగానికి అంటే 43 ఏళ్ల ఆరు నెలలకు ఆ శిక్షను తగ్గించింది అక్కడి న్యాయస్థానం.




థాయ్‌లాండ్‌లో రాచరిక పాలన ఇప్పటికీ కొనసాగుతుంది.. అంతేకాక అక్కడ రాజును విమర్శించడం నేరం. ఎవరైనా ఆ దేశ అధినేతపై విమర్శలు చేస్తే శిక్షార్హులవుతారు. అలాగే తాజా కేసులో సదరు మహిళా ఉద్యోగిని ఆరేళ్ల కిందట ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాల వేదికగా రాజు మహా వజ్ర లాంగ్‌కోర్న్‌ను విమర్శిస్తూ కామెంట్లు, ఆడియో సమాచారాన్ని ఇతరులతో పంచుకున్నారు. థాయ్‌లాండ్ శిక్షా స్మృతిలోని ఆర్టికల్‌ 112 ప్రకారం ఇది తీవ్రమైన నేరం. ఒక్కో తప్పిదానికి 3 నుంచి 15 ఏళ్ల వరకు కఠిన జైలు శిక్ష విధించవచ్చు. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగిని నేరం చేసినట్టు నిర్థారణ కావటంతో బ్యాంకాక్‌ క్రిమినల్‌ కోర్టు ఆమెకు కఠిన శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసే అవకాశం ఉందని శిక్ష పడిన మహిళ తరపు న్యాయవాది తెలిపారు. ఈ తీర్పుపై మానవహక్కుల సంఘాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది దిగ్భాంత్రికరమని, రాజరికాన్ని విమర్శించడం సహించరానిదనే కాకుండా.. ఇందుకు తీవ్ర దండన ఉంటుందనే సందేశాన్నిస్తోందని థాయ్‌ లాయర్స్‌ ఫర్‌ హ్యుమన్‌ రైట్స్‌ సంస్థ మండిపడింది. రాజ్యాంగబద్ధ రాజరిక వ్యవస్థలో ఈ విధమైన శిక్ష మంచిది కాదని విమర్శకులు అంటున్నారు.



 
 ఆ మహిళా ఉద్యోగినిని 2015లో అరెస్ట్ చేశారు. మొత్తం మూడేళ్ల తొమ్మిది నెలలు జైల్లోనే గడిపింది. తర్వాత 2018లో ఆమెకు బెయిల్ లభించింది. బాధితురాలు అంచన్ (65) 2014-15 మధ్య యూట్యూబ్‌లో 26 సందర్భాల్లోనూ, ఫేస్‌బుక్‌లో మూడుసార్లు రాజుపై విమర్శలు గుప్పిస్తూ పోస్ట్‌లు చేశారు. గతంలోనూ రాజుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తికి 70 ఏళ్లు జైలు శిక్ష విధించారు. గత నవంబరు నుంచి ఇప్పటి వరకు 50 మందిని ఇటువంటి ఆరోపణలతోనే అరెస్ట్ చేశారు. ఈ కేసును మిలటరీ కోర్టు నుంచి క్రిమినల్ కోర్టుకు బదిలీ చేసినప్పుడు తన చర్యలకు పశ్చాత్తాపంతో నేరాన్ని అంగీకరించానని, ఎందుకంటే తాను ఆడియోను మాత్రమే విడుదల చేశానని, ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇటువంటి సమాచారాన్ని చాలా మంది షేర్ చేస్తున్నారని వ్యాఖ్యానించింది. తాను 40ఏళ్లు ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వర్తించానని, రిటైర్‌మెంట్‌కు ఏడాది ముందు అరెస్ట్ చేశారని వాపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: