సెంటిమెంట్లకు, బంధాలకు పెద్దపీట వేసే మన భారతదేశ కుటుంబ వ్యవస్థని చూసి ప్రపంచంలోని ఇతర దేశాలు గౌరవిస్తాయి. కానీ మన భారతదేశంలో కాలం గడుస్తున్న కొద్దీ విలువలు దిగజారిపోతున్నాయి. బంధాలు తెగిపోతున్నాయి. పుత్రుడు తల్లిదండ్రులను పున్నామ నరకం నుంచి రక్షిస్థాడని అనే నానుడికి తిలోదకాలు వదిలాడు ఒక కసాయి కొడుకు. ఆ నికృష్టపు కొడుకు తల్లిదండ్రులకు బ్రతికుండగానే నరకం చూపించాడు. 80 ఏళ్ల వృద్ధుడైన తండ్రిని గదిలో బంధించి తిండి పెట్టలేదు. రోజుల తరబడి ఆహారం లేకపోవడంతో ఆ పెద్దాయన ఆకలితో అలమటించి, చిక్కి శల్యమై ఆఖరికి మరణించాడు. ఆ వృద్ధుడితో పాటు గదిలో బందీగా ఉన్న ఆయన భార్య ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ దుర్ఘటన కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా మందక్కయం పట్టణంలో చోటు చేసుకుంది.
 


ముందక్కయమ్ పట్టణానికి చెందిన రెజీ (42) అనే వ్యక్తి తన తల్లిదండ్రులు పోడియన్ (80), అమ్మినీ (76)ను కొన్ని రోజులుగా ఇంట్లోని ఓ గదిలో బంధించాడు. వారికి ఆహారం పెట్టలేదు. ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారు చాలా రోజుల కిందటే గమనించారు. అతడిని నిలదీయగా ఫూటుగా తాగొచ్చి వారిని దూషించేవాడు. అంతేకాకుండా తాను బయటకి వెళ్లాల్సి వచ్చినప్పుడు హాల్‌లో పెంపుడు కుక్కను వదిలిపెట్టేవాడు. రెజీ చేష్టలకు, పనులకు భయపడి స్థానికులు అతని జోలికి వెళ్ళలేదు. కానీ రోజులు గడిచేకొద్దీ స్థానికుల్లో ఆందోళన మొదలైంది. తిండి లేక ఆ ముదుసలి తల్లిదండ్రులు ఎక్కడ చనిపోతారేమోనని భయపడి, జాలిపడి ఆశా వర్కర్లకు, ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సహాయంతో వారు ఆ ఇంటికి చేరుకున్నారు. ఇక గది తెరచి చూడగా, గదిలో పడి ఉన్న వృద్ధులను చూసి హతాశులయ్యారు. వెంటనే వారిని హాస్పిటల్‌లో చేర్పించారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. రోజుల తరబడి ఆహారం లేకపోవటం కారణంగా ఆ వృద్ధుడి శరీర అవయవాలన్నీ దెబ్బతిన్నాయి. అందువల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ పెద్దాయన కన్నుమూశాడు. ఆయన పోస్టుమార్టం రిపోర్టు చూసిన వైద్యులు నివ్వెరపోయారు. తిండి లేక అవయవాలన్నీ ఒక్కొక్కటీ చచ్చుబడిపోయిన తీరు వారిని కంటతడి పెట్టించింది. ఇక నరరూప రాక్షసుడిగా ప్రవర్తించిన రెజీ తన తల్లిదండ్రుల పట్ల ఇంత కర్కశంగా ఎందుకు ప్రవర్తించాడనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే రెజీ భార్యను కూడా కేసులో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఇంకా ఆ ముదుసలి తల్లి మాత్రం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. ఆ పెద్దాయన ఎలాగూ బ్రతకలేదు కనీసం ఈ పెద్దావిడ అయినా సరే ఆరోగ్యంగా బయటపడితే అదే చాలునని పలువురు దేవుడిని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: