థానే: చిన్న పిల్లలు నిద్రలో పక్క తడపడం సహజం. ఆదమరచి నిద్రపోతున్న సమయంలో వారికి తెలియకుండా ఇలా జరుగుతుంది. అయితే దీనిని తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోరు. కానీ ఓ తండ్రి మాత్రం కన్న కొడుకు పక్క తడిపాడని పాశవిక చర్యకు పూనుకున్నాడు. దుర్మార్గంగా అతడి మర్మాంగంపై కాలే కడ్డీతో వాత పెట్టాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. దీనిపై ఫిర్యాదు అందడంతో సదరు తండ్రితో పాటు ఆ వ్యక్తి రెండో భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడి సొంత తల్లి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

పిల్లలపై తల్లిదండ్రులకుండే ప్రేమ అంతా ఇంతా కాదు. వారి ప్రేమకు హద్దులుండవంటారు. పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లడిల్లిపోతారు. కోపంలో చిన్న దెబ్బ కొట్టినా తరువాత వారిని దగ్గరకు తీసుకుని ఎంతగానో బుజ్జగిస్తారు. అయితే థానేలోని ఓ తండ్రి మాత్రం దారుణంగా ప్రవర్తించాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వారు.. బాలుడి పట్ల క్రూరంగా హింసించారు. థానేలోని వాగ్లే ఎస్టేట్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తి తన రెండో భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అతడు తన మొదటి భార్యకు పుట్టిన కొడుకు(9)ను తన వద్దే ఉంచుకున్నాడు. అయితే రోజూ రాత్రి సమయంలో ఆ చిన్నారి పక్కతడుపుతుండడంతో అతడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. తెలిసి తెలియక చేసిన తప్పుకు అతన్ని దారుణంగా కొట్టాడు. బాలుడి మర్మాంగంపై వాతలు కూడా పెట్టాడు. ఈ దారుణంలో అతడికి అతడి రెండో భార్య సహకరించింది.

విషయం తెలుసుకున్న బాలుడి అసలు తల్లి.. పోలీసులను ఆశ్రయించింది. తన కొడుకుపై జరిగిన దాడి గురించి పోలీసులకు వివరించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి అరెస్ట్‌లూ చేయలేదని స్థానిక పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. కానీ ఆ బాలుడి తల్లి మాత్రం తన కొడుకును ఇంతగా బాధపెట్టిన తన మాజీ భర్తకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన స్థానికులు కూడా ఆ బాలుడి తండ్రి, సవతి తల్లి చేసిన పాశవిక చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: