నాగ్‌పూర్: దేశ వ్యప్తంగా ఇటీవల క్షుద్రపూజలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. క్షుద్రపూజల ఉచ్చులో చిక్కుకుని కొందరు శీలం కోల్పోతుంటే మరికొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. క్షుద్ర పూజల పేరిట మైనర్‌పై వేధింపులకు పాల్పడిన ఓ వ్యక్తి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం నాగ్‌పూర్‌కు చెందిన విక్కి గణేష్‌ ఖప్రే అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌తో స్నేహం చేసుకున్నాడు. ప్రత్యేక పూజలు చేస్తే ఆమెకు కోట్లకు కోట్లు డబ్బులు లభిస్తాయని నమ్మించాడు. దానికోసం తాను చెప్పినట్లు చేయాలని సూచించారు.

క్షుద్రపూజలు చేయాలని, అది కూడా ఒంటిమీద నూలు పోగు లేకుండా పూజలు చేస్తే కోట్ల డబ్బు వచ్చి పడుతుందని చెప్పాడు. అయితే అతడి మాటలపై అనుమానపడిన ఆ బాలిక.. అతడికి దూరంగా ఉండసాగింది. అయినప్పటికి విక్కి.. ఆమెపై ఒత్తిడి చేయడం మానుకోలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. విక్కి తనతో ఏం చెప్పాడో, అతడు ఏం చేయమన్నాడో మొత్తం చెప్పింది.  దుస్తులు విప్పేసి పూజలు చేస్తే 50 కోట్ల రూపాయల డబ్బుల వర్షం కురుస్తుందంటూ ఏదో చెబుతున్నాడంటూ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. కేసుతో సంబంధం ఉన్న మరికొంతమందిని కూడా అరెస్ట్‌ చేశారు.
                
ఈ క్రమంలోనే పోలీసులు మాట్లాడుతూ.. తాజాగా ఇలాంటి క్షుద్ర పూజల సంఘటనలు ఎక్కువవుతున్నాయని, ఇలాంటి కేటుగాళ్లను నమ్మవద్దని హెచ్చరించారు. తాజాగా బాధితురాలు మోసపోకముందే తమను ఆశ్రయించడం ప్రశంసనీయమని, నిందితుడిని, అతడికి సహకరించిన వారికి కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: