కొత్తగూడెం:  వేరే మహిళతో సంబంధం పెట్టకున్న భర్తకు ఆ భార్య భారీ షాక్ ఇచ్చింది. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదింది. అతడితో పాటు ఆ యువతికీ కూడా బడితపూజ చేసింది. ఈ ఘటన కొత్త గూడెం జిల్లా, గాజులరాజాం బస్తీలో చోటు చేసుకుంది. అప్పటికే సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడకు పోలీసులు చేరుకున్నారు. అయితే అప్పటికే ఆమె భర్తను, అతడితో ఉన్న మహిళను ఒళ్లు హోనమయ్యేలా కొట్టింది. పోలీసులు వెంటనే ఆమెను వారించారు. అందరినీ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన కొత్తగూడెం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది.
     
గాజులరాజాం బస్తీలో రాజు అనే వ్యక్తి కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ఓ యువతిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు.  అయితే కొన్ని నెలలుగా రాజు.. మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే మోసం చేసి మరో యువతితో సంసారం చేయసాగాడు. అతడిపై అనుమానం వచ్చి భార్య అనేకసార్లు నిలదీసింది. కానీ రాజు సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో ఎలాగైనా అతడి రహస్యం బయటపెట్టాలని నిర్ణయించుకున్న ఆ భార్య.. ఓ రోజు కాపుకాసి భర్తను వెంబడించింది.

భార్య వెంబడిస్తున్న విషయం తెలియక ఆ భర్త చక్కగా ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. అతడు అలా లోపలికి వెళ్లగానే బయటనుంచి గడియ పెట్టేసింది బయటే ఉన్న భార్య. వెంటనే బంధువులకు ఫోన్ చేసింది. వారు రాగానే గడియ తీసి లోపలకు భర్తను, అతడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువతిని ఆమె రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వారినలా చూడగానే ఆమె కోపం కట్టలు తెంచుకుంది. అంతే ఇద్దరికీ బడితపూజ చేసింది. చేతికి అందినదానితో బాదేసింది. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి వారిని స్టేషన్‌కు తరలించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: