తాజాగా ఆయేషాబాను కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి.ఆమె తరపు న్యాయవాది జాఫర్ పఠాన్ కోర్టుకు ఆమె రాసిన లేఖ సమర్పించారు. అయేషా అందులో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పూసగుచ్చినట్టు రాసుకొచ్చింది. తనను ఓ గదిలో నాలుగు రోజులపాటు బంధించారని, అందులో ఉన్నన్ని రోజులు తనకు తిండి పెట్టలేదని పేర్కొంది. ‘‘నా ప్రియమైన ఆరు (ఆరిఫ్). నా పేరును ఆసిఫ్తో ముడిపెట్టడంవల్ల నా మనసు బద్దలైంది. అతడు నాకు మంచి స్నేహితుడు, సోదరుడు. నేను గర్భవతిగా ఉన్నప్పుడు నన్ను చూసేందుకు నీవు రాలేదు’’ అని అందులో రాసింది. ఆరిఫ్ ను తాను ప్రేమించానని, కానీ అతడు రెండు జీవితాలను నాశనం చేశాడని లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లయిన రెండు నెలల నుంచే అయేషాకు కష్టాలు మొదలయ్యాయని పఠాన్ కోర్టుకు తెలిపారు. ఆమె ఎదుటే ఆరిఫ్ మరో యువతితో మాట్లాడేవాడని పేర్కొన్నారు. ఏ స్త్రీ కూడా తన వైవాహిక బంధం విచ్ఛిన్నమవ్వాలని కోరుకోదని, ఎంతో ఆనందంగా, కోటి ఆశలతో మెట్టింటికి వచ్చిందని, ఆమెను వారు సరిగా ఆదరించలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.
తన జీవితంలో మరో మహిళ ఉందని, ఆయేషా కోసం ఆమెను వదులుకోబోనని ఆరిఫ్ తెగేసి చెప్పాడని, దీంతో అయేషా మనసు ముక్కలైందని పఠాన్ అన్నారు. అయితే, తల్లిదండ్రుల గురించి ఆలోచించి మౌనంగా ఉండిపోయిందన్నారు. ఆయేషా ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆరిఫ్ పరారయ్యాడు. అతనికోసం గాలిస్తున్న గుజరాత్ పోలీసులు చివరకు రాజస్తాన్లోని పాలిలో అరెస్ట్ చేశారు.