ప్రేమ రెండు మనసులను ఒక్కటి చేస్తుంది. ప్రేమ కోసం చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే ప్రేమ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమ ఎంతటి దుర్మార్గం చేయడనికైనా వెనుకాడదు. ఇక ప్రేమించిన వారి కోసం ఎంతకైనా తెగిస్తారు కొందరు ప్రేమికులు. కొందరు ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. మరికొందరు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేసి ప్రేమికులిద్దరూ కలిసుండేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి ఘటన తాజాగా హైదరాబాద్‌ నగరంలోని మైలార్‌దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.

అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే.. పాతబస్తీని చెందిన ఓ యువకుడు స్థానికంగా ఉండే యువతిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఇంతలో యువతి తల్లిదండ్రులు ఆమెకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. పాతబస్తీలోని మైలార్‌దేవ్ పల్లి శాస్త్రీపురం కింగ్స్ కాలనీకి చెందిన నదీమ్ అనే యువకుడికి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని యువతి కుటంబ సభ్యులు నిర్ణయించారు.

ఈ తరుణంలో యువతికి, నదీమ్‌కు నిశ్చితార్థం జరిపించారు. అయితే ఇది తెలుసుకున్న ప్రియుడు.. నిశ్చితార్థాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలని డిసైడ్ అయ్యాడు. ఇంకేముందు నదీమ్‌ను కిడ్నాప్‌ చేయాలని భావించాడు. ఆ మేరకు స్కెచ్ వేశాడు. శనివారం నాడు నదీమ్ బైక్‌పై వెళ్తుండగా.. సదరు ప్రియుడు కారులో వచ్చి అడ్డగించాడు. నదీమ్‌ను కారులోకి లాక్కె్ళ్లి కిడ్నాప్ చేశాడు.

ఇక యువతిని తాను ప్రేమించానని, ఆమెతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా, ఈ కిడ్నాప్‌ కు వ్యవహారం అంతా ఘటనా స్థలంలో ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు కిడ్నాప్ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్నారు. సిసి కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: