నేటి యువత అన్ని విషయాల్లోనూ తొందర పడుతున్నారని చెప్పడానికి తాజాగా జరుగుతున్న ఎన్నో సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా చదువుకోవాల్సిన యువత చదువు మానేసి గాలికి తిరుగుతూ ప్రేమ, పెళ్లిళ్లు అంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పుల కారణంగా హత్యలు, ఆత్మహత్యలకు కూడా వెలుగుచూస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.


ఈ ఘటనకు సంబంధించి సైదాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. రెయిన్‌బజార్‌కు చెందిన జమాల్పుర్‌ కరణ్‌లాల్‌ అనే ఓ వ్యక్తి మాంసం విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే అతనికి దీపక్‌ కుమార్‌ అనే 18 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఐతే దీపక్‌ 2020 సంవత్సరం లో హయత్‌నగర్‌ లో నివసించే ఒక అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకుని హయత్‌నగర్‌లోనే కాపురం పెట్టాడు. ఒకవైపు తన భార్యతో కాపురం చేస్తూనే మరోవైపు మరో యువతిని ప్రేమించడం ప్రారంభించాడు. ఈ విషయం కాస్తా భార్యకు తెలియడంతో.. ప్రియురాలిని వదిలేయాలని ఆమె దీపక్ పై ఒత్తిడి చేస్తుండేది. మరోవైపు ప్రియురాలు కూడా తనని వదిలి పెట్టొద్దని దీపక్ ని ఒత్తిడి చేస్తుండేది.



దీనితో భార్య, ప్రియురాలి ఒత్తిళ్లు భరించలేకపోతున్నానంటూ సైదాబాద్‌లోని తన స్నేహితులతో చెప్పుకుని దీపక్ బాధపడేవాడు. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం స్థానిక ధోబీఘాట్‌ వద్దకు వెళ్ళిన దీపక్ తన తండ్రికి ఫోన్ చేసి.. జీవితంపై విరక్తి పుట్టిందని అందుకే ఎర్రకుంట చెరువు దగ్గరలో ఉన్న ఒక పాడుబడిన బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన తండ్రి హుటాహుటిన 100కు సమాచారం అందించగా.. సైదాబాద్‌ పోలీసులు ఎర్రకుంట చెరువు వద్దకు చేసుకున్నారు. కానీ అప్పటికే దీపక్‌ కుమార్‌ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతపురం కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: