చేయని తప్పుకు శిక్ష అనుభవించిన వారు జీవితంలో చాలా కోల్పోతారు. కొన్నేళ్ల తర్వాత వారు తప్పు చేయలేదని తెలిసినా.. వారి జీవితానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. వారు నష్టపోయిన కాలాన్ని తిరిగి తేలేము. అందుకే ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న సమయంలో కోర్టులు పరిహారం చెల్లించాలని తీర్పు చెప్తాయి. ఇలా చేయని తప్పుకు ఓ ఇద్దరు సోదరులు దాదాపు 30 ఏళ్లు జైలుశిక్ష అనుభవించారు. కోర్టు వారిద్దరూ నిర్ధోషులని ప్రకటించి.. చేయని తప్పుకు వారు శిక్షను అనుభవించేలా చేసిన ఆ సోదరులకు అధికారులు రూ.550 కోట్ల పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.

వివరాల్లోకి వెళితే.. 1983లో ఉత్తర కరొలినా రాజధాని రాలీలోని నార్త్‌ రాబ్సన్‌ కౌంటీలో 11 ఏళ్ల బాలిక తన ఇంట్లో హత్యాచారానికి గురైంది. ఈ కేసులో హెన్రీ మెక్‌కల్లమ్‌, లియోన్‌ బ్రౌన్‌ అనే ఇద్దరు సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు సాక్షాలతో వారిపై రాబ్సన్‌ జిల్లా కోర్టులో అభియోగాలు మోపారు. వారికి కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

అయితే 2014లో ఆ ఇద్దరి డీఎన్‌ఏను పరిశీలించిన తర్వాత బాలికను అత్యాచారం, హత్య చేసింది వారు కాదని తేలింది. రోస్కో ఆర్టిస్‌ అనే వేరే వ్యక్తి ఈ నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో కోర్టు వారిద్దరిపై ఉన్న కేసులను కొట్టివేసింది. తప్పుడు కేసులు మోపి, తాము శిక్ష అనుభవించడానికి కారుకులైన జేమ్స్‌ లాక్‌లియర్‌, కెన్నెత్‌ సీలి అనే పోలీసు అధికారులపై ఆ ఇద్దరు సోదరులు 2015 నుంచి కోర్టులో పోరాటం చేశారు. మెకల్లమ్‌, బ్రౌన్‌కు రూ.550 కోట్ల పరిహారం చెల్లించాలని నార్త్‌ కరోలినా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ అధికారుల తరఫున వాదించిన న్యాయవాదులు రూ.66 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఒప్పుకున్నారు. అయితే ఆ ఇద్దరు సోదరులు మానవహక్కుల ఉల్లంఘన కింద కోర్టులో పోరాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: