ఇటీవలే నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో పరువు హత్యలు ఎలా జరుగుతున్నాయి. కులం మతం అనేది ఇంకా ఎలా పేరుకుపోయింది అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇక అచ్చంగా లవ్ స్టోరీ లాగే ఉంది ఇక్కడ ఇద్దరి ప్రేమికుల కథ కూడా. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. తమిళనాడు లోని ఈరోడ్ కు చెందిన 29 ఏళ్ల సెల్వన్ అనే యువకుడు ఇళమతి అనే యువతి ఓ ప్రైవేట్ కంపెనీలో  పనిచేస్తున్నారు. అక్కడ ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడగా కొన్నాళ్ళకే వీరి స్నేహం ప్రేమగా మారి పోయింది. అయితే వీరిద్దరిది మాత్రం వేరు కులాలు కావడం గమనార్హం.



 అయినప్పటికీ తాము  పెళ్లి చేసుకుంటాము అన్న విషయాన్ని కాస్త ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పినప్పటికీ కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు కూడా వీరి ప్రేమను వ్యతిరేకించాయి. తల్లిదండ్రులు ఎంత వద్దని చెప్పినా ఒకరిని ఒకరు విడిచి ఉండడానికి  మాత్రం వారి మనసు అంగీకరించలేదు. దీంతో ఏకంగా కన్నవాళ్లకు ఎదిరించి మరి కలిసి బతకాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. ఇక కొన్ని నెలల పాటు ఎవరికీ తెలియకుండా కాపురం పెట్టి ఎంతో సంతోషంగా జీవించారు. కానీ అటు యువతి కుటుంబ సభ్యులు మాత్రం వీరు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకోవడానికి గాలింపు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో వీరి ఆచూకీ వారికి తెలిసింది. ఇక వీరు ఉంటున్న చోటికి వచ్చిన యువతి కుటుంబ సభ్యులు యువకుడిని కొట్టి యువతిని బలవంతంగా తీసుకెళ్లారు.


 దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సెల్వన్ తాము మేజర్లమని అయినప్పటికీ తనపై దాడి చేసి తన భార్యను తీసుకెళ్లారు అంటూ పోలీసులను ఆశ్రయించాడు. అయితే అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రి కి యువతీ కుటుంబ సభ్యులకు సన్నిహిత సంబంధం ఉండడంతో  పోలీసులు కూడా కేసు నమోదు చేయకుండా దీనిని లైట్ తీసుకొన్నారు. ఇంతలో సెల్వన్ ఫోన్ కి వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది. తనను చంపాలని చూస్తున్నారు కాపాడు అంటూ ఏకంగా ఇళమతి ఒక మెసేజ్ పెట్టింది. ఈ క్రమంలోనే పోలీసులను ఆశ్రయిస్తే లాభం లేదు అనుకున్న సదరు యువకుడు మీడియా ముందుకు వచ్చేశాడు. జరిగిన విషయం వివరించాడు. తన భార్యకు ప్రాణహాని ఉందని అంటూ కోరడంతో చివరికి పోలీసులు కేసు నమోదు చేశామని విచారణ జరుపుతున్నామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: