అత్యాచారాలు, హత్యలు చేసిన దుండగులను, కామాంధులను కాల్చిచంపినా కానీ నేటికి కామాంధుల్లో మార్పులు రాకపోవడం దురదృష్టకరమని చెప్పవచ్చు. తాజాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారమతిపేట గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంపై ఇద్దరు కామాంధులు కర్కోటకులుగా మారి.. పాశవికదాడికి పాల్పడడంతో పాటు ఓ మహిళపై అత్యాచారం, హత్య ఉదంతం సంచలనం రేకెత్తించింది.
వివరాల్లోకి వెళ్లితే... తారమతిపేట గ్రామానికి చెందిన ఇరగదిండ్ల ఈదయ్య(65), ఇరుగదిండ్ల అండాలు (58) దంపతులు. వీరికి కుమారుడు, కూతురు కలరు. అయితే కుమారుడు మల్లేష్ కుటుంబంతో సహా హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నాడు.
అయితే ఈదయ్య, అండాలు దంపతులు మాత్రం కూలీనాలి చేసుకుంటూ తారమతిపేటలోనే నివసిస్తున్నారు. ఈనెల 22న రాత్రి అదే గ్రామానికి చెందిన బడిగె శ్రీకాంత్, దేవర సురేష్ అనే ఇద్దరు యువకులు ఈదయ్య ఇంటి వద్దకు వచ్చారు. ఈదయ్యతో కలిసి ముగ్గురు మద్యం సేవించారు. మద్యం అతిగా సేవించడంతో ఈదయ్య మత్తులోకి జారుకోవడంతో భార్య అండాలుపై అత్యాచారం చేయడంతో పాటు హత్య చేసి పరారయ్యారు. మంగళవారం ఉదయం ఈదయ్య మద్యం మత్తులోంచి తేరుకొని లేచి చూడగా అండాలు ఒంటిపై ఉన్న దుస్తులు చిందరబందరగా పడి ఉండడంతో పాటు ఒంటిపై గాయాలుండడంతో గట్టిగా కేకలు వేసాడు. కేకలు విన్న స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే కుమారుడు మల్లేష్కు ఫోన్ లో సమాచారం అందించారు స్థానికులు.
తొలుత ఈదయ్యనే హత్య చేశాడని గ్రామంలో ప్రచారం జరిగింది. అయితే కొడుకు తండ్రిని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై కుమారుడు మల్లేష్ అబ్దుల్లాపూర్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వనస్థలిపురం ఏసీపీ కే.పురుషోత్తం రెడ్డి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలు చేరుకొని ఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. తారమతిపేట గ్రామంలో ఓ నడిఈడు అత్యంత పాశవికంగా ఇద్దరు యువకులు హత్య చేయడం బయటికి రావడంతో గ్రామమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అండాలు హత్య కేసులో ఇద్దరు నిందితులలో పోలీసులు ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకోగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అండాలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.