ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి యేడాది అవుతోంది. జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ సీఎం... ఏ పార్టీ, ఏ ప్రభుత్వం అమలు చేయలేదన్నది వాస్తవం. వలంటీర్లు, గ్రామ సచివాలయం ద్వారా జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల వల్ల మంచి పేరు వచ్చింది. అయితే జగన్ ప్రభుత్వంలో చాలా మంది ఎమ్మెల్యేలు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నది నిజం. ఇందుకు ప్రధాన కారణం జగన్ తన ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడమే. నిన్న మొన్నటి వరకు జగన్ ఏకంగా 80 మంది ఎమ్మెల్యేలకు ఈ యేడాది కాలంలో అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్న టాక్ వచ్చింది.
ఈ అసంతృప్తి ఎక్కువ అవ్వడంతోనే చివరకు ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వంపై ఓపెన్గానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కొందరు పార్టీ కీలక నేతలు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళ్లడంతో జగన్ వీరికి అపాయింట్ మెంట్లు ఇవ్వడంతో పాటు వీరు అడిగిన పనులకు నిధులు మంజూరు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రతి రోజు సాయంత్రం కొంత టైం ఇకపై ఎమ్మెల్యేలను కలిసేందుకే జగన్ కేటాయించుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం జగన్ తొలి విడతలో భాగంగా కొందరు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
వీరిలో కోలగట్ల వీరభద్రరావు, సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, కళావతి, ధనలక్ష్మి, జొన్నలగడ్డ పద్మావతి, మంత్రి పుష్ప శ్రీవాణి, ఎంపీ అనురాధాలు ముఖ్యమంత్రిని కలిశారు. వారి వారి నియోజకవర్గాల్లోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ విజ్ఞప్తి మేరకు అక్కడ మెడికల్ కాలేజ్, రోడ్ల విస్తరణకు సీఎం ఓకే చెప్పారట. ఇక మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి విజ్ఞప్తి మేరకు రాజోలిబండ కుడికాలువ నిర్మాణానికి సీఎం సానుకూలంగా స్పందించారని సమాచారం. ఇక బుధవారం కూడా సీఎం మరి కొందరు ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇచ్చినట్టు టాక్.. ఏదేమైనా జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎమ్మెల్యేల్లో ఎక్కడా లేని సంతోషం వ్యక్తమవుతోంది.