నిజమే.. కేసీఆర్ సాగు చట్టాలపై ఇటీవల మాట్లాడిన మాట వాస్తవమే.. డిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలకు మద్దతుగా తాము దేశ్యాప్తంగా పోరాటం చేస్తామన్న మాటా నిజమే.. సాగు రైతులను విమర్శించిన మాటా నిజమే.. త్వరలో ఢిల్లీకి వచ్చి ఆందోళన చేస్తామన్న మాటా నిజమే.. కానీ.. కేవలం కేసీఆర్ హెచ్చరికలతోనే మోడీ దిగివచ్చారా.. అంటే ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. వాస్తవానికి మోడీ ఈ నిర్ణయం రైతులపై ప్రేమతో తీసుకున్నదేమీ కాదు. యూపీ, పంజాబ్ వంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్న సమయంలో బీజేపీకి ఎదురుగాలి వీయకుండా తీసుకున్న నిర్ణయంగానే చూడాలి.
అందుకే.. దీన్ని టీఆర్ఎస్, కేసీఆర్ విజయంగా వర్ణించడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబడుతున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదికి పైగా పోరాడారని.. రైతుల హక్కులను అదానీ, అంబానీలకు తాకట్టు పెట్టాలని చూస్తే రైతులు ఎదురు తిరిగారని రేవంత్ అంటున్నారు. రైతుల విజయాన్ని కేసీఆర్ గొప్పగా తెరాస నేతలు చెప్పడం సిగ్గు చేటన్నారు రేవంత్ రెడ్డి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కోరినా కేసీఆర్ పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కేసీఆర్ రైతుల ఉద్యమానికి ఏ ఒక్కరోజు కూడా మద్దతు పలకలేదని.. అలాంటి కేసీఆర్ ఒక్కపూట చేసిన ధర్నాకే మోదీ భయ పడ్డారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అదే నిజమైతే.. మరి ధాన్యం విషయంలో కేంద్రం ఎందుకు దిగిరావట్లేదుని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఎప్పుడూ మోదీకి వ్యతిరేకంగా పని చేయలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అనేక బిల్లుల ఆమోదం విషయంలో కేసీఆర్ మోడీకి సహకరించారని అన్నారు.