ఇంతకీ ఈ ఎన్ఎస్జీ అంటే ఏంటి.. న్యూక్లియర్ సప్లయిస్ గ్రూప్.. అంటే.. అణు పదార్థాలను సరఫరా దేశాల కూటమి అన్నమాట. ప్రపంచంలోని అణు సామర్థ్యం ఉన్న దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంటుంది. అయితే.. ఇండియా కూడా అణ్వస్థ్ర సామర్థ్యం ఉన్న దేశమే కానీ.. ఇప్పటి వరకూ ఇండియాకు ఈ ఎన్ఎస్జీలో స్థానం లభించలేదు. అణు సామర్థ్యం ఎక్కువ దేశాలకు ఉండకూడదన్నది ఈ ఎన్ఎస్జీ ప్రధాన ఉద్దేశ్యం. అణు శక్తి ఎక్కువ దేశాల చేతుల్లోకి వెళ్తే దాని వల్ల ప్రపంచ వినాశనం తప్పదన్న ఉద్దేశ్యంతో ఈ నిబంధన విధించారు.
ఈ ఎన్ఎస్జీ కూటమిలో ఉన్న దేశాలే పరస్పరం అణు పదార్థాలను, టెక్నాలజీనీ పంచుకుంటుంటాయి. ఇలాంటి ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. అయితే ఇందులో సభ్యత్వం దక్కాలంటే.. అన్ని సభ్య దేశాలు పూర్తిగా అనుమతించాలి. నిన్న మొన్నటి వరకూ అమెరికా కూడా ఈ ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం మద్దతు ఇవ్వలేదు. కానీ.. ఇటీవలి కాలంలో ఇండియా పట్ల అమెరికా వైఖరి మారింది. ఇప్పుడు ఎన్ఎస్జీలో ఇండియాకు సభ్యత్వం ఇచ్చేందుకు అమెరికా ఓకే చెప్పేసింది.
కానీ కీలక దేశమైన అమెరికా ఓకే చెప్పినా.. అంతేకీలకమైన చైనా మాత్రం ఇండియాను ఎన్ఎస్జీలోకి రాకుండా అడ్డుకుంటోంది. 48దేశాల కూటమి అయిన ఎన్ఎస్జీలోకి ఇండియా రాకుండా చైనా కుట్రపన్నుతోంది. గతంలో ఇండియా అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయలేదన్న సాకుతో చైనా ఇండియా రాకను వ్యతిరేకిస్తోంది.