ఇక సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన తరువాత ఎంపీ తన పర్యటనను వాయిదా వేసుకుని తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. అంతకుముందు తనను సీఐడి విచారణ పేరుతో ఏపీకి పిలిపించడం వెనుక కుట్ర దాగి ఉందని విమర్శిస్తూనే, అయినా తాను విచారణకు హాజరవుతానని ఆయన మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే..విచారణకు హాజరైన సమయంలో తనపై పార్టీ అభిమానుల పేరుతో కొంతమంది సామూహికంగా దాడి చేసి హత్య చేసేందుకు పథకం పన్నారని ఎంపీకి తెలిసిందని అందుకే ఆయన ఢిల్లీ వెళ్లిపోయారని ఎంపీ సన్నిహిత వర్గాల ద్వారా మీడియాకు లీకులిచ్చారు. ఇక శుక్రవారం ఢిల్లీ నుంచి ఆయన ఇదే అంశంపై మరింత స్పష్టమైన ఆరోపణలకు దిగారు. గుంటూరు జిల్లాలో ప్రతిపక్ష టీడీపీ నేతను అధికార పార్టీ నేతలు హతమార్చిన విషయాన్ని కూడా ఇదే సందర్బంగా ఆయన ప్రస్తావించారు.
చిరంజీవికి వైసీపీ రాజ్యసభ అవకాశం ఇస్తున్నట్టు వచ్చిన వార్తలపై మాట్లాడుతూ చిరంజీవి ప్రతిష్టను దెబ్బతీసేందుకే వైసీపీ ప్రభుత్వం ఈ ప్రచారం చేస్తోందని కూడా ఆరోపించారు. అంతేకాదు.. జగనన్న గోరుముద్ద పథకం కూడా ఏపీలో ఇకపై కొనసాగదని, తాను చేసిన ఫిర్యాదుపై కేంద్రమంత్రి స్పందించారని కూడా ఎంపీ తెలిపారు. ఈ నేపథ్యంలో రఘురామ ఆరోపణలు వాస్తవమేనా లేక రాజకీయంగా సానుభూతి కోసం చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఎంపీ రఘురామరాజు ప్రస్తుతం కేంద్రం కల్పించే వై కేటగిరీ భద్రత మధ్య ఉన్నారు. ఆయనపై హత్యా ప్రయత్నం చేయడమంటే వైసీపీ ప్రభుత్వానికి అది ఆత్మహత్యా సదృశమే అవుతుంది. గతంలో ఆయనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారన్న కేసులో ప్రభుత్వం ఇప్పటికే డిఫెన్స్లో ఉంది. మరిప్పుడు మళ్లీ ఇలా జరిగే అవకాశం ఉందా అంటే నమ్మడం కష్టమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి మరి రఘురామరాజు ఆరోపణల వెనుక ఏముందో ప్రధానికి ఆయన రాసే లేఖలోనైనా స్పష్టమవుతుందేమో చూడాలి.