తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టబోతున్నారు. ఇక వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండబోతోంది. ఈ మేరకు ఓ చట్టం రూపొందించాని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ మీటింగ్‌లో కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై విధివిధానాలు ఏర్పాటు చేయడం కోసం ఓ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఈ నిర్ణయం అమలులో వచ్చే ఇబ్బందులను అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది.


అయితే.. ఇదే నిర్ణయం ఏపీలో జగన్ తాను అధికారంలోకి వచ్చిన మొదట్లోనే తీసుకున్నారు. ఇప్పుడు ఏపీలో చాలా వరకూ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లే ఉన్నాయి. జగన్ ఏపీలో తెలుగు మీడియం ఎత్తేసినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. కొన్ని పత్రికలు తెలుగును చంపేస్తారా అంటూ జగన్‌ను నిలదీశాయి. దీనిపై వరుస కథనాలు కూడా ప్రచురించాయి. అయినా జగన్ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. అయితే.. చివరకు విషయం కోర్టుకు వెళ్లడంతో అక్కడ పెండింగ్‌లో పడింది.


కొన్ని పత్రికలే కాదు.. తెలుగు భాషాభిమానులు, భాషా పండితులు కూడా జగన్ నిర్ణయాన్ని అప్పట్లో తప్పుబట్టారు. వారిలో చాలా మంది హైదరాబాద్‌లో ఉంటున్నవారే.. ఇప్పుడు.. గతంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ అమలు చేయాలని చూస్తున్నారు. మరి ఇప్పుడు అదే భాషా ప్రేమికులు, భాషాభిమానులు జగన్ సర్కారుపై విమర్శలు చేసినట్టే తెలంగాణ సర్కారుపైనా చేస్తారా.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా.. ఆ మేరకు పత్రికలు కూడా కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తాయా.. అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


బహుశా.. అలాంటి పరిణామాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్‌లో ఉన్నవాళ్లకు జగన్ ను విమర్శించడం చాలా సులువు..కానీ అదే నోళ్లు కేసీఆర్‌ను విమర్శించాలంటే మాత్రం కాస్త ఆలోచిస్తాయి.. ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాయి.. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో.. భాషాభిమానులు ఏమంటారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: