కేవలం మంత్రి పదవి అంటే అధినేతకు భజన చేయడం... ప్రతిపక్ష నేతలని చెడామడా తిట్టడం. ఇదే గొప్ప క్వాలిఫికేషన్ అయిపోయింది. ఇలా చేస్తే చాలు వారికి మంత్రి పదవులు ఫిక్స్. అందుకే ఏపీలో దాదాపు అందరు మంత్రులు ఇదే పనిలో ఉన్నారు. ఏదో ఒకరిద్దరు నేతలు మాత్రమే తమ శాఖలకు సంబంధించిన పనుల్లో ఉన్నారేమో గాని..మిగతా వారంతా జగన్కు భజన చేయడం, చంద్రబాబుని తిట్టడం చేస్తున్నారు. ఇక అలాంటి మంత్రులకు ప్రజల్లో కూడా ఆదరణ తగ్గుంతుందని పలు సర్వేలు కూడా చెబుతున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రులు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు.
అసలు చాలా మంది మంత్రులు చివరకు తమ నియోజకవర్గాల్లో కూడా తిరగడం లేదు. వారి పనితీరుపై నియోజకవర్గ ప్రజలే పెదవి విరుస్తున్నారు. కీలకమైన గోదావరి జిల్లాల విషయానికొస్తే..తూర్పు, పశ్చిమల్లో కలిపి మొత్తం ఆరుగురు మంత్రులు ఉన్నారు. తూర్పులో ముగ్గురు, పశ్చిమలో ముగ్గురు. పశ్చిమలో ఉన్న ఆళ్ళ నాని, తానేటి వనిత, చెరుకువాడ రంగనాథరాజుల పరిస్థితి ఆశాజనకం లేదు. తానేటి వనిత అసలు మంత్రిగా ఉన్నారో లేదో ? కూడా తెలియడం లేదు. రంగనాథరాజుపై వేటు తప్పదన్న ప్రచారం బలంగా జరుగుతోంది.
అటు తూర్పులో కన్నబాబు ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తున్న చెల్లుబోయిన వేణుగోపాల్, పినిపే విశ్వరూప్ల పనితీరుకు మంచి మార్కులు ఏమి పడటం లేదు. పినిపే విశ్వరూప్ గతంలో కూడా మంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి పూర్తి నిస్తేజంగా ఉంటున్నారని వైసీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. చెప్పడానికి కాస్త విచిత్రంగా ఉన్నా సరే..ఇందులో కొందరు మంత్రులు అనే సంగతి సొంత జిల్లా ప్రజలకే పెద్దగా తెలియని పరిస్థితి. ఇంకా రాష్ట్రంలో ఏమి తెలుస్తారు. కన్నబాబు మాత్రమే కాస్త హైలైట్ అవుతున్నారు. మిగిలిన మంత్రులంతా ప్రజల్లో కనిపించడం చాలా తక్కువ.