ఇటీవల ఆస్పత్రుల్లో శవాలను అంబులెన్సుల్లో తీసుకెళ్లడం లేదన్న ఆరోపణలు కలకలం రేపాయి. బయటి అంబులెన్సులను ప్రభుత్వాసుపత్రుల ప్రాంగాణాల్లోకి రానివ్వని అంబులెన్సుల దందా కారణంగా ప్రభుత్వానికీ చెడ్డపేరు వచ్చింది. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలపై ఫిర్యాదుల కోసం 104 కాల్ సెంటర్ ను వినియోగిస్తామన్న ఎంటీ  కృష్ణబాబు.. 104 కాల్ సెంటర్ ను ఈవారంలో  బలోపేతం చేస్తామన్నారు.


అన్ని జిల్లాల కలెక్టర్లతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కృష్ణబాబు.. డ్రైవర్ల ప్రవర్తన , డబ్బులు డిమాండ్ చేయడం, ఆరోగ్య శ్రీ సేవల్లో అలసత్వం, వాహనాలు అందుబాటులో లేకపోవడం వంటి వాటిపై 104కు ఫిర్యాదు చెయ్యొచ్చని సూచించారు. ఫిర్యాదులపై వెనువెంటనే ఆరా తీసి చర్యలకు ఉపక్రమిస్తామన్నారు. ఫీవర్ సర్వేను తేలిగ్గా తీసుకోవద్దని కలెక్టర్లకు ఎంటి కృష్ణ బాబు ఆదేశాలు జారీ చేశారు. హెల్త్ కేర్ , ఫ్రంట్ లైన్ వర్కర్లు , అరవయ్యేళ్లు పైబడిన వారికి ప్రికాషనరీ డోస్ ను వేగవంతం చెయ్యాలని సూచించారు.


లక్ష్యాన్ని చేరుకునేలా స్పెషల్ డ్రైవ్ ను చేపట్టాలన్న కృష్ణబాబు.. జిల్లాల్లో క్యాడర్ వారీగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి  ప్రతినెలా శిక్షణ ఇవ్వాలన్నారు. శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి సమయానికి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని.. కొవిడ్ వల్ల మరణించిన వారికి పరిహారం చెల్లించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఎం.టి. కృష్ణ బాబు ఆదేశించారు. జిల్లాల పునర్విభజన అనంతరం ఎన్ హెచ్ ఎం సిబ్బంది సర్దుబాటును సమీక్షించాలని.. ఆసుపత్రులలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ , ఎన్వోసీ తదితర అంశాలపై సమీక్షించాలని ఎం.టి. కృష్ణ బాబు  సూచించారు.


ఫైర్ సేఫ్టీ ఆడిట్ కు సంబంధించి అన్ని ఆసుపత్రుల మాస్టర్ డేటా అప్లోడ్ కు చర్యలు తీసుకోవాలని.. ఈనెల 30లోగా పోస్టుల్ని భర్తీ చేయాలన్న సిఎం ఆదేశాల్ని అమలుచేస్తామని.. ఎం.టి. కృష్ణ బాబు  తెలిపారు. ప్రభుత్వాసుపత్రులకొచ్చే పేదలకు సేవలందించడంలో ఏమాత్రం అలసత్వం వహించొద్దని.. ఆసుపత్రుల నుండి పేదలు సంతోషంగా తిరిగి ఇంటికెళ్లాలన్నదే సిఎం జగన్మోహన్ రెడ్డి అభిమతమని ఎం.టి. కృష్ణ బాబు  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: