ముంబయి ఐఐటి ప్రొఫెసర్ చైతన్య సింగ్ సోలంకి.. సౌర విద్యుత్‌పై గతంలో అనేక పరిశోధనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఇంధన వనరుల వినియోగం వల్ల పెరిగిపోతున్న కాలుష్యం.. దాని పర్యవసానంగా జరుగుతున్న వాతావరణ మార్పులు ఆయన్ను ఆందోళనకు గురి చేశాయి. ఇప్పటికే పెరిగిన కాలుష్యం కారణంగా రుతువులు గతి తప్పి.. విశ్వం భవితవ్యమే అంధకారం కాబోతుంది. ముందు తరాలు దీని దుష్ఫలితాలు అనుభవించబోతున్నాయి. పర్యావరణ విధ్వంసంపై మథన పడిన సోలంకి.. ప్రజలను జాగృతం చేయడమే తన లక్ష్యంగా భావించారు.


నూటికి నూరు శాతం సౌర శక్తిని వాడినప్పుడే ఈ దుష్ఫరిణామాలు అంతమతాయని భావిస్తున్న సోలంకి.. ఆ దిశగా జనంలో చైతన్యం నింపాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగానికి పదేళ్లు  సెలవు పెట్టి.. ఎనర్జీ స్వరాజ్ యాత్ర ప్రారంభించారు. ఓ బస్సులో దేశమంతా ప్రయాణిస్తూ ప్రజలను జాగృతం చేస్తున్నారు.  సోలంకి చేపట్టి ఈ ఎనర్జీ స్వరాజ్‌ యాత్ర.. పదేళ్ల పాటు సాగనుంది. సౌరశక్తి పై ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన కల్పించడం.. ప్రతి ఇంటిలో సౌరశక్తిని ఉపయోగించేలా ప్రేరేపిచడం ఆయన యాత్ర లక్ష్యాలు. ఈ యాత్ర కోసం సోలంకి స్వయంగా ఓ సౌర బస్సును తయారు చేసుకున్నారు.


మహాత్మాగాంధీ స్ఫూర్తితో సుదీర్ఘ యాత్రకు సంకల్పించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రయాణించడం.. దారిలో ప్రజలు, విద్యార్థులకు సౌరశక్తి పై అవగాహన కల్పించడం.. చేస్తున్నారు. ఈ పదేళ్ల యాత్రలో ఎప్పుడు ఎక్కడకి చేరుకోవాలి.. ఎక్కడ బస చేయాలి అనే ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. యాత్రకు అవసరమైన అన్ని వసతులు బస్సులోనే సమకూర్చుకున్నారు.


చైతన్య సింగ్ సోలంకి.. గతంలో మహారాష్ట్రలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని మోడల్ సోలార్ విలేజ్ గా తీర్చిదిద్దారు. అందుకు ప్రధానమంత్రి ఆవిష్కరణ అవార్డు అందుకున్నారు. సౌర విద్యుత్‌ రంగంలో మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డులు కూడా స్థాపించారు. ఇప్పటి వరకూ 28 వరకూ సైన్స్ అవార్డులు అందుకున్నారు. ఈ భూమిని కాపాడుకోవడం కేవలం ప్రభుత్వాల పని మాత్రమే కాదని.. ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాలుపంచుకోవాలని సోలంకి సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: