ప్రపంచంలోని అనేక సైనిక బలగాలను పరిశీలించిన తర్వాత ఇచ్చే ఈ ర్యాంకుల్లో ఇండియా ర్యాంకు చైనాను అధిగమించింది. ఈ ర్యాంకింగ్స్లో అమెరికాకు చెందిన ఎయిర్ ఫోర్స్ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానం అమెరికా నేవీ ఏవియేషన్ దే.. మూడోస్థానంలో రష్యన్ ఎయిర్ఫోర్స్, నాలుగో స్థానంలో అమెరికా ఆర్మీ ఏవియేషన్ నిలిచాయి. ఐదో స్థానంలోనూ అమెరికాకే చెందిన మెరైన్ కార్ప్స్ నిలిచింది. ఆ తర్వాత ఆరో స్థానంలో భారత వైమానిక దళం ఉంది. ఇండియా తర్వాత ఏడో స్థానంలో చైనా వైమానిక దళం ఉండటం విశేషం.
అంతే కాదు.. దేశాల వారీగా చూస్తే ఇండియా ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది. విచిత్రం ఏంటంటే ఇండియా కన్నా ఎక్కువ సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఉన్నా కూడా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ఫోర్స్ ఏడో స్థానంలోనే నిలిచింది. యుద్ధ రంగంలో కీలక పాత్ర పోషించే వైమానిక దళాల విషయంలో ఇండియా ర్యాంకు చైనాను దాటేయడం నిజంగా ఇండియాకు గర్వకారణం అని చెప్పొచ్చు.
అయితే.. ఈ ర్యాంకులను చైనా అంత సులభంగా ఒప్పుకుంటుందా.. అందుకే అసలు ఆ నివేదికే తప్పని చైనా వాదిస్తోంది. భారత వైమానిక దళం కంటే తమ బలమే గొప్పదని చెబుతోంది. తమ వైమానిక దళాల అసలైన లెక్కలు తీసుకోకుండానే వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ నివేదిక రూపొందించిందని చైనా సమర్థించుకుంటోంది. అందుకే అసలు ఆ నివేదికను తాము పట్టించుకోవడం లేదని చెబుతోంది.