ఇప్పుడు విపక్షాల నుంచి విమర్శలు పెరుగుతున్న సమయంలో జగన్ తప్పు దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్లో మిగిలిన 8 వేలకుపైగా పోస్టులు సత్వరమే భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా ఆదేశించారు. ఉన్నత విద్యలో ఖాళీల భర్తీపైనా దృష్టిపెట్టాలని, పోలీసు రిక్రూట్మెంట్పై కార్యాచరణ అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 2021–22 జాబ్ కాలెండర్ ద్వారా మొత్తం 39 వేల 654 మంది నియామకం చేసినట్లు సీఎం జగన్ తెలిపారు.
అయితే.. జాబ్ క్యాలెండర్లో మిగిలిన పోస్టులను వెంటనే భర్తీ చేయలని సీఎం జగన్ ఆదేశించారు. పోలీసు ఉద్యోగాల భర్తీపై కార్యాచరణ రూపొందించి దాని ప్రకారం క్రమం తప్పకుండా ఉద్యోగాల భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్మెంట్ సహా ఇంకా భర్తీచేయాల్సిన పోస్టులపై నిన్న సీఎం సమగ్రంగా సమీక్షించారు. జాబ్ క్యాలెండర్లో భాగంగా రిక్రూట్ చేసిన పోస్టుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బ్యాక్లాక్ పోస్టులు, ఏపీపీఎస్సీ, వైద్య, ఆరోగ్య – కుటుంబ సంక్షేమశాఖ, ఉన్నత విద్య తదితర శాఖల్లో జరిగిన, జరుగుతున్న నియామకాల విషయాన్ని సీఎం చర్చించారు.
2021–22 ఏడాదిలో 39,654 పోస్టులను భర్తీచేసినట్టు అధికారులు జగన్కు చెప్పారు. ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే 39 వేల 310 పోస్టులు భర్తీ చేసామని చెప్పారు. 47,465 పోస్టుల్లో 83.5 శాతం పోస్టుల రిక్రూట్మెంట్ ను ఈ ఒక్క ఏడాదిలోనే పూర్తి చేసినట్లు తెలిపారు. కానీ.. 16.5శాతం పోస్టులను, అంటే సుమారు 8వేల పోస్టులు ఇంకా భర్తీచేయాల్సి ఉందన్నారు. నిర్దేశించుకున్న పోస్టుల్లో ఇంకా భర్తీ కాకుండా మిగిలిన పోస్టుల రిక్రూట్మెంట్పై కార్యాచరణ రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంటే జగన్ తప్పు దిద్దుకుంటున్నారా?