ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అందివచ్చిన టెక్నాలజీని అందుకుని దూసుకుపోకపోతే.. ముందుకువెళ్లలేం.. ఇప్పుడు ఇండియా కూడా టెక్నాలజీలో దూసుకుపోతోంది. ప్రత్యేకించి కరోనా తర్వాత ఇండియాలో డిజిటలైజేషన్ ప్రక్రియ జోరందుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే డిజిటల్ సాంకేతికత దేశ ప్రజల జీవన విధానాన్ని మార్చివేసింది. ఈ మాట మన దేశ ప్రధాని కూడా చెబుతున్నారు. విభిన్న సేవలను ఆన్ లైన్  చేయడం ద్వారా క్యూలైన్లను భారత్  నిర్మూలించిందని ప్రధాని మోదీ అన్నారు.


గుజరాత్ లోని గాంధీనగర్ లో డిజిటల్ ఇండియా వీక్ -2022ను ప్రారంభించిన ప్రధాని అక్కడే ఈ వ్యాఖ్యలు చేశారు. పుట్టినతేదీ ధ్రవృపత్రాలు, బిల్లుల చెల్లింపులు, రేషన్, అడ్మిషన్లు, పరీక్షా ఫలితాలు, సర్టిఫికెట్లు సహా బ్యాంకు సేవల కోసం గతంలో క్యూ లైన్లు ఉండేవి.. కానీ ఇప్పుడు వాటిన్నిటినీ ఆన్ లైన్ చేయడం ద్వారా క్యూలైన్లను ఇండియా నిర్మూలించిందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన... డిజిటల్ ఇండియా మధ్యవర్తులను తీసివేసిందన్నారు. దీని ద్వారా పేద ప్రజలకు అవినీతి నుంచి ఊరట కల్పించిందని ప్రధాని మోదీ  చెప్పారు.


వచ్చే మూడు-నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీని 300 బిలియన్ డాలర్లకుపైగా తీసుకెళ్లాలని ఇండియా టార్గెట్ పెట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం చిప్ టేకర్ నుండి చిప్ మేకర్ కావాలని కోరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇన్ స్పేస్, కొత్త డ్రోన్ పాలసీ వంటి విధానాలతో రాబోయే కాలంలో భారత్  సాంకేతిక సామర్థ్యానికి కొత్త శక్తిని అందిస్తాయని ప్రధాని మోదీ అంటున్నారు. డిజిటల్ ఇండియా వీక్  కార్యక్రమంలో కేంద్ర ఐటీశాఖ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న వివిధ డిజిటల్ సేవలను ప్రధాని మోదీ ప్రారంభించారు.


డిజిటల్ టెక్నాలజీ ఇండియా ముఖ చిత్రాన్నే మార్చేస్తోంది. అంతే కాదు.. ప్రత్యేకించి డిజిటల్ విద్య భారత విద్యావ్యవస్థను కూడా సమూలంగా మార్చేస్తోంది. విద్య దేశం నలుమూలలకూ వెళ్తోంది. ప్రధాని మోదీ చెప్పినట్టు..  వచ్చే మూడు-నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీని 300 బిలియన్ డాలర్లకుపైగా తీసుకెళ్లాలని ఇండియా పెట్టుకున్న టార్గెట్ అందుకోవాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: