తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కోరిన డీఎంకే సీనియర్ నేత ఏ రాజా.. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొంత ఫ్లాష్ బ్యాక్ కూడా డీఎంకే సీనియర్ నేత ఏ రాజా వివరించారు. ద్రవిడ ఉద్యమకారుడు తాంథై పెరియార్ ప్రత్యేక తమిళనాడు దేశం కోసం పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే.. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై మాత్రం ప్రతిపత్తి మాత్రమే కోరారని.. తాము కూడా ఆ బాటలోనే నడుస్తున్నామన్నారు.
అయితే.. తమను పెరియార్ బాటలోకి నెట్టవద్దంటూ మోదీ, అమిత్ షాలకు డీఎంకే సీనియర్ నేత ఏ రాజా విజ్ఞప్తి చేశారు. తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి సాధించే వరకూ ఉద్యమం ఆపబోమంటున్నారు డీఎంకే సీనియర్ నేత ఏ రాజా. అయితే ఏ రాజా మాటలు కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. ఇండియా వంటి సువిశాల దేశంలో అనేక ప్రాంతాలు, భాషలు, ప్రత్యేక లక్షణాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఇంత పెద్ద దేశాన్ని పాలించే పాలకులకు అంత సమ దృష్టి ఉండాలి.
అలా కాకుండా తమ సొంత రాష్ట్రాలకు కేంద్రం నిధులన్నీ పంచి పెడతాం అనే ధోరణి దేశానికి మంచిది కాదు. కొంత కాలంగా దేశంలో ఉత్తరాది నేతల ప్రాబల్యం పెరుగుతోంది. వాస్తవానికి ఉత్తరాది కంటే దక్షిణాది అన్ని రంగాల్లోనూ ముందున్నా.. అనేక విషయాల్లో వివక్ష మాత్రం కొనసాగుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. దేశంలో వేర్పాటు వాదాలు వేళ్లూనుకునే ప్రమాదం పొంచి ఉంది.