అంగబలం అర్ధబలం ఉండడంతోనే ఎంపి గోరంట్ల మాధవ్ ని వెనకేసుకువస్తున్నారు నటుడు పృధ్వీ రాజ్ మండిపడుతున్నారు. ఈనెల నాలుగున బయట పడిన ఆ దరిద్రపు వీడియోకి సంబంధించి... ఆ తర్వాత ఎంపి మాధవ్ భాష అన్నీ వైసీపీ పార్టీ నేతలకు బాగా నచ్చినట్టు ఉన్నాయని పృధ్వీ ఎద్దేవా చేశారు. ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండమన్న పృధ్వీ... పార్లమెంట్ లో తెలుగు ఎంపిలకు ఒక మంచి చరిత్ర ఉందని.. ఇప్పుడు గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంతో అది అంతా తుడిచి పెట్టుకుపోయిందని మండిపడ్డారు.
నా వ్యవహారంలో వారం పాటు ఖాళీ లేకుండా ప్రెస్ మీట్లు పెట్టిన ఆ పార్టీ నేతలు ఇప్పుడేమయ్యారని పృధ్వీ ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో విషయంలో ఎస్పీ చెబుతున్నవిషయాలు ఒకదానికొకటి పొంతనే లేదని పృథ్వీ అన్నారు. ప్రజలు ఆ మాత్రం అవగతం చేసుకోకుండా ఉండరన్న పృధ్వీ... చివరకు ఇది ఫేక్ అని తేల్చేయడం దారుణమన్నారు.
తనపై చర్య తీసుకుని.. ఇప్పుడు గోరంట్ల మాధవ్ పై చర్య తీసుకోకపోవడాన్ని ఆయన్ను జీర్ణంచుకోలేకపోవచ్చు.. కానీ.. పృథ్వీ వివాదానికి, గోరంట్ల వివాదానికి చాలా తేడా ఉంది. పృధ్వీరాజ్ ఏకంగా టీటీడీ వంటి పవిత్రమైన ఆలయానికి చెందిన ఛానల్ డెరెక్టర్గా ఉండి.. విధుల్లోనే ఉద్యోగినితో సరసమాడే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు గోరంట్ల మాధవ్ విషయంలో అసలు అవతల ఉన్న మహిళ ఎవరో కూడా తెలియదు.. అందులోనూ పృథ్వీ ఆ ఆడియో తనదేనని పరోక్షంగా అంగీకరించారు. కానీ మాధవ్ అలా కాదు. అయితే.. పార్టీ మాధవ్కు అండగా నిలబడటాన్ని మాత్రం పృథ్వీ జీర్ణించుకోలేకపోతున్నారు.