ఎంపీడీవో పేరుగు గ్రూప్ వన్ ఉద్యోగమే. అయినా.. అందులో ప్రమోషన్లు ఉండవు. ప్రస్తుతం ఎంపీడీవోలు గా ఉన్న చాలా మంది పాతికేళ్ల క్రితమే ఎంపీడీవోగా ఉద్యోగాల్లో చేరారు. కానీ.. ఉద్యోగంలో చేరిన దాదాపు 25 ఏళ్లు దాటుతున్నా వారికి ప్రమోషన్లు లేవు. అదేమంటే ఆ పోస్టే అంత అంటారు. అలాంటి ఉద్యోగుల సమస్యపై సీఎం జగన్ స్పందించారు. ఆయన చొరవతో ఈ సమస్య పరిష్కారం అయ్యింది. ఉద్యోగంలో చేరిన పాతికేళ్ల తర్వాత తొలిసారిగా ఎంపీడీవోలకు ప్రమోషన్లు లభించాయి.
తాజాగా 12 మంది జెడ్పీ డిప్యూటీ సీఈవోలుగా, మరో 225 మంది డీఎల్డీవో స్థాయి హోదాలో ఒకేసారి 237 మంది ఎంపీడీవోలు ప్రమోషన్లు పొందారు. ప్రమోషన్లు వచ్చిన వారిలో నలుగురు జడ్పీ సీఈవో హోదాలో, మరో నలుగురు డీపీవోలుగా, 13 మంది డిప్యూటీ సీఈవోలుగా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో 11 మంది, మరో ఆరుగురు డీఆర్డీఏలలో ఇప్పుడు నియమించబడ్డారు.
పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఎంపీడీవోలు 300 మందికి పైగా ఉన్నా.. అందుకు అవకాశం ఉన్న పోస్టులు 13 మాత్రమే ఉన్నాయి. దీనికి తోడు సీనియారిటీ వివాదాల కారణంగా పాతికేళ్లుగా ఎంపీడీవోలకు ప్రమోషన్ల అంశం పెండింగ్లో ఉండిపోయింది. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనిపై దృష్టి సారించారు. ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించి.. పరిష్కార బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. ఇప్పుడు ఎంపీడీవోల పదోన్నతుల కోసమే 51 డీఎల్డీవో పోస్టులు కొత్తగా మంజూరు చేశారు. 149 పోస్టుల్లో ఆన్డ్యూటీ లేదా డిప్యుటేషన్ గా ఎంపీడీవోలకు మాత్రమే పదోన్నతులకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలా పాతికేళ్ల ఎంపీడీవోల పదోన్నతల కల నెరవేరింది.