ప్రముఖ కథా రచయిత వి. విజయేంద్రప్రసాద్‌ కొన్ని నెలల క్రితం ఎంపీగా రాష్ట్రపతి కోటాలో ఎంపికైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బీజేపీ వర్గాలతో ఆయన సన్నిహితంగా ఉంటున్నారు. అయితే.. ఆయన్ను రాజ్యసభకు పంపడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇలాంటి నిర్ణయాన్ని ఎవరూ ఊహించలేదు. అయితే.. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్‌ తనకు ఎంపీ ఛాన్స్ ఇచ్చినందుకు బీజేపీకి రుణం తీర్చుకుంటున్నారా అనిపించే నిర్ణయం ఒకటి ప్రకటించారు.


అదే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ పై సినిమా.. తాను త్వరలో ఆర్‌ఎస్‌ఎస్‌ పై సినిమా, వెబ్ సీరిస్ తీయబోతున్నానని విజయేంద్ర ప్రసాద్‌ ప్రకటించారు. ఆర్ఎస్‌ఎస్‌ గురించి తాను తెలుసుకోవడంలో చాలా ఏళ్లు ఆలస్యం చేసినందుకు తీవ్ర పశ్చాత్తాపం చెందానని విజయేంద్రప్రసాద్‌ అంటున్నారు. త్వరలో ఆర్‌ఎస్‌ఎస్‌పై సినిమా, వెబ్‌సిరీస్‌ తీయబోతున్నట్లు విజయేంద్ర ప్రసాద్‌  విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఎంత గొప్పది అనేది తాను ప్రజల ముందు ఉంచబోతున్నానని విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు.


మూడు నాలుగేళ్ల క్రితం వరకు తాను ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల ఎక్కువ మంది ప్రజల్లో మెదులుతున్న ఓ విధమైన వ్యతిరేక భావనే ఉండేదని విజయేంద్ర ప్రసాద్‌  గుర్తు చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ పై సినిమా కథ రాయమంటే అందుకు ఒప్పుకుని నాగపూర్‌ వెళ్లి తొలిసారి సంఘ్‌ ప్రధాన కార్యాలయం చూశానని..  సంఘ్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌ను కలిసి మాట్లాడిన తర్వాత తీవ్ర పశ్చాత్తాపం చెందానని విజయేంద్ర ప్రసాద్‌  అన్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు బహిరంగంగా కూడా చెబుతున్నానని విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు.


కాశ్మీర్‌ను కాపాడింది.. పాకిస్థాన్‌లో కలిసిపోకుండా నిలువరించగలిగింది ఆర్ఎస్‌ఎస్‌నే అని విజయేంద్ర ప్రసాద్‌  అన్నారు. కాశ్మీర్‌ ప్రాంత హిందువులపై మారణహోమాలను ఆపగలిగింది కూడా ఆర్ఎస్ఎస్‌ అనే విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్‌, భజరంగి భాయిజాన్ వంటి సినిమాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్‌ రూపొందించే ఆర్ఎస్‌ఎస్‌ పై సినిమా, వెబ్‌ సీరిస్‌ ఎలా ఉంటాయో అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: