ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన గట్టిగా పోరాటం చేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేనకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని సర్వేల్లో తేలిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అక్టోబర్ లో బస్ యాత్ర ఉంటుందని గతంలో ప్రకటించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మధ్య కాలంలో పార్టీ సన్నద్ధత, ప్రభుత్వ భవిష్యత్తుపై కొన్ని సూచనలు తమకు వచ్చాయన్న పవన్ కళ్యాణ్.. ఈ పరిస్థితుల్లో మరింత సన్నద్ధంగా ఉండి యాత్ర చేపట్టాలని సూచించారని తెలిపారు.
అన్ని రకాలుగా ఆలోచన చేసిన తర్వాత అక్టోబరులో చేపట్టాల్సిన యాత్రను కొన్నాళ్ల పాటు వాయిదా వేస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈలోపుగా జనసేన చేపట్టిన జనవాణి, కౌలు రైతుల భరోసా యాత్రను పూర్తి చేస్తామని పవన్ కళ్యాణ్ వివరించారు. వచ్చే నెల నుంచి ప్రతి నియోజకవర్గంపైనా సమీక్షలు చేపడతామన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ప్రతి అంశానికి చివరి తేది ఉంటుందని, మనిషికి, అధికారానికి కూడా చివరి తేది ఉంటుందన్నారు.
మెజార్టీ ఉందని తీసుకునే ప్రతి నిర్ణయం సరైనదే అని అనుకోవడం మంచిది కాదని ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హితవు పలికారు. చట్ట సభల్లో అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చి నేడు మూడు రాజధానులు అనడం మంచిది కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 2019లో ప్రజలు ఆలోచించి ఓటేశారో.. ఒక్క ఛాన్స్ అని ఓటేశారో కానీ.. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.