గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి పార్టీలో అసమ్మతి తీవ్రమవుతోంది. ఆమె  పార్టీ పదవులను అమ్ముకుంటూ అవినీతి పాల్పడుతున్నారని అదే పార్టీకి చెందిన మేడికొండూరు జడ్పిటిసి సభ్యులు కందుల సిద్దయ్య ఆరోపిస్తున్నారు. మేడికొండూరులో వైసీపీ నేతలు సమావేశం నిర్వహించుకున్నారు. ఎమ్మెల్యే తాడికొండ శ్రీదేవి పనితీరుపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే తాడికొండ శ్రీదేవి నియోజకవర్గంలోని అధికారుల నుంచి అక్రమంగా లంచం తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.


ఎమ్మెల్యే తాడికొండ శ్రీదేవి అవినీతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా కలగజేసుకుని అవినీతి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లు క్రితం రోడ్డు ప్రమాదం జరిగిందని..  సీఎం రిలీఫ్ ఫండ్ కి అర్జీ పెట్టుకున్నా ఇంతవరకు ఎమ్మెల్యే శ్రీదేవి కార్యాలయం నుంచి ఆర్జీలు వైసీపీ పార్టీ కార్యాలయానికి వెళ్ళలేదని జడ్పిటిసి నాయకుడు చెబుతున్నారు. అధికార పార్టీ జెడ్పిటిసి కే దిక్కులేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.


ఒక రూపాయి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి అందలేదని ఆయన తెలిపారు. నా పరిస్థితే ఇలా ఉంటే..  ఓట్లేసి గెలిపించిన సాధారణ ప్రజలకు ఏమి న్యాయం చేస్తామని సిద్దయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పనితీరుతో వైకాపా పార్టీ తాడికొండ నియోజవర్గంలో పూర్తిగా దెబ్బ తిన్నదని సిద్దయ్య అంటున్నారు. కోవర్టులు గా పనిచేసే వారిని పక్కన పెట్టుకొని అసలైన కార్యకర్తలకు తాడికొండ శ్రీదేవి అన్యాయం చేస్తోందని సిద్దయ్య ఆరోపించారు.


చివరకు సొంత పార్టీ నాయకులు నుంచి శ్రీదేవి లంచం తీసుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీకి పనిచేస్తామని... ఎమ్మెల్యే శ్రీదేవికి వ్యతిరేకం కాదని వారు చెబుతున్నారు.  తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డొక్కా మాణిక్య వరప్రసాద్ కు కూడా తాము అనుకూలం  కాదని వారు తెలిపారు. తాడికొండ శ్రీదేవి గెలుపు కోసం ఎంత కష్టపడ్డామని డబ్బులు ఖర్చు పెట్టుకున్నామని వారు అంటున్నారు. అధికారంలో ఉండి మేడికొండూరులో రాజశేఖర్ రెడ్డి విగ్రహం ప్రతిష్టించలేకపోయామని వారు వాపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: