ఈ విషయంలో ఆయా జిల్లాల రైతులు చూపిన పోరాట స్పూర్తిని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ప్రకటనలో అభినందించారు. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు పోరాటంలో తాను స్వయంగా పాల్గొన్నానని.. తనతో పాటు ఎంతోమంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారని చెప్పారు. మాపై నాన్ బెయిల్ కేసులు పెట్టారని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఎన్ని నిర్బంధాలు, మరెన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.
కేసీఆర్ పాలనలో రైతులే కాదు.. సామాన్య, మధ్య తరగతి ప్రజలంతా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయారని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన స్వార్ధ ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులపాల్జేసి సామాన్యులు బతకలేని దుస్థితికి తీసుకొచ్చారని బండి సంజయ్ దుయ్యబట్టారు. అవినీతి, కుటుంబ, నియంత పాలనతో రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులు పూర్తిగా దిగజార్చారని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు.
కేసీఆర్ పాలన ఇలాగే కొనసాగితే తెలంగాణ మరో శ్రీలంక, పాకిస్తాన్ మాదిరిగా మారే దుస్థితి ఉందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ సర్కార్ ను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కామారెడ్డి, జగిత్యాల జిల్లా రైతాంగం చూపిన తెగువ, పోరాట పటిమ అందరికీ ఆదర్శమని బండి సంజయ్ అన్నారు.