నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. గురువు అంటే సమసమాజ స్థాపనలో ప్రధాన పాత్ర పోషించాల్సిన వాడు. రేపటి సమాజం ఎలా ఉంటుందో నేడు గురువులను బట్టే ఉంటుంది. నేటి సమాజం సహజంగా నిన్నటి గురువుల సృష్టే. ఈ సమాజం ఇలా ఉంది అంటే గతంలో ఉన్న గురువులు అప్పటి తమ విద్యార్థులను సరిగా తీర్చిదిద్ద లేదన్నట్టే. విద్యార్థి బుద్దిని ప్రభావితం చేయగల ఏకైన మార్గదర్శి గురువే. ఆయన సరిగా లేకపోతే ఇక ఆయా విద్యార్థుల చే ఏర్పడిన సమాజం ఇంకెలా ఉంటుందో ఊహించవచ్చు. అలాగని అందరు ఒకేలా ఉంటారు అనేది కాదు. మంచిని చూసి కూడా తలతిప్పుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు, చెడును చూసి తలతిప్పుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. రెండు తప్పే. ఆయా సంస్కారాలు నేర్చుకునేది గురువు దగ్గరే. అందుకే సమాజ నిర్మాణంలో గురువు చాలా ప్రధానం.

నేడు పాఠశాలలలో కూడా ఎటువంటి ప్రవర్తన కలిగిన ఉపాధ్యాయులు ఉంటున్నారో చూస్తూనే ఉన్నాం. పసిపిల్లలపై అత్యాచారాలు చేస్తూ.. వీళ్లు నిర్మించే సమాజం ఎవరిని మింగేస్తుంది. అప్పటి సమాజంలో ఆయనకు సంబందించిన వాళ్ళు ఉండరా.. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనలో మృగం బహిర్గతం కాకుండా చేసుకోగలం. అలా కాకుండా ఎవడు ఎలా పోతే నాకేముంది అనుకుంటే మాత్రం ఈ సమాజం కంటే క్రూర మృగాలు ఉన్న కారడవి చాలా మేలు, అక్కడి జీవాలు ఇంకా మేలైనవి అని చెప్పాల్సి ఉంటుంది. ఎక్కువ జనాభా ఉందని, పోటీ తత్త్వం లో విలువలు మరిచిపోతే అది పోటీ అనిపించుకోదు సరికదా నీలో మనిషి లక్షణాలు అంతరించి మృగం మాత్రమే మిగులుతుంది.  తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు పెద్దలు. అంటే తల్లిదండ్రుల తరువాత అంత పాత్ర పోషించాల్సింది గురువే. నిజానికి విధ్యాబ్యాసంలో ఉన్నప్పుడు గురువే సర్వం(తల్లి, తండ్రి, గురువు, దైవం).

సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించే గురువులే దారితప్పితే వారికి ఏ గురువు పాఠాలు చెప్పాలో మరి..! అలాంటి స్థితికి గురుస్థానం పడిపోకుండా ఎప్పుడూ వాళ్ళు తల్లిదండ్రుల తరువాత అంత వారిగా తమవద్దకు వస్తున్న విద్యార్థులను చూసుకుంటే సమాజం ఆరోగ్యంగా తయారవుతుంది.  ఆరోగ్యంగా లేని సమాజంలో ఎంత ఆస్తి ఉన్నప్పటికీ సౌకర్యంగా జీవించడం అసాధ్యం. ఇప్పటి సమాజం అటువైపే వెళ్తుంది. అందుకే ఇప్పుడే ఈ సమాజానికి గురువు అవసరం. వారిపాత్ర వాళ్ళు నిర్వర్తిస్తే భవిష్యత్తు మరింతగా స్వచ్ఛంగా ఉంటుంది.  అది అందరు గుర్తిస్తే మంచిది. అలాగే నేడు సమాజంలో గురువులను గౌరవించే సంస్కారం కూడా లేని వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. నీకు సంస్కారం లేకపోవటం వాళ్లకు నష్టం ఏమి కలిగించదు. గురువు మాట వినిపించుకోకపోతే నష్టపోయేది ఆ వ్యక్తి లేదా సమాజం మాత్రమే, గురువుకు ఏమి నష్టం ఉండదు. ఈ విషయాన్ని తెలుసుకుంటే, ఆరోగ్యమైన సమాజం అదే తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: