`సోమ‌వారం ఢిల్లీలో అద్భుతం జ‌రిగింది.. ఈ ప‌రిణామాన్ని మేం కూడా ఊహించ‌లేదు!`-ఇదీ ఏ ఇద్ద‌రు బీజే పీ నేత‌లు, ఏ ఇద్ద‌రు జ‌న‌సేన నాయ‌కులు ఫోన్లు చేసుకున్నా.. సాగిన సంభాష‌ణ‌!! నిజ‌మే.. ఇలా చ ర్చించు కోవ‌డంలో అర్ధం ఉంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న అటు బీజేపీలోనూ, ఇటు జ‌నసేన‌లోనూ ఉత్సాహం నింపింది. ఉరుముల్లేని పిడుగు మాదిరిగా ప‌వ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు.. ఆయ‌న అక్క‌డ బీజేపీ నేత‌ల కోసం ప‌డిగాపులు కాసిన‌ప్పుడు పెద్ద‌గా ఎవ‌రూఊహించ‌లేదు కానీ, త‌ర్వాత మాత్రం ఊహ‌ల‌కు రెక్క‌లు తొడిగాయి.

 

రాష్ట్రంలో బీజేపీ-జ‌న‌సేన క‌లిసి ముందుకు సాగుతాయ‌ని తెలియ‌డంతో ఒక్క‌సారిగా ప‌వ‌న్‌కు బూమ్ వ‌చ్చింది. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓట‌మి పాలైన ప‌వ‌న్, ఆయ‌న పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు పుంజుకోలేదు. అయితే, తాజాగా బీజేపీ పెద్ద‌ల ఆహ్వానం మేర‌కే ప‌వ‌న్ ఢిల్లీలో ప‌ర్య‌టించిన‌ట్టు ఓ వ‌ర్గం మీడియా ప్ర‌చారం చేసింది. రాష్ట్రంలో నెల‌కొన్ని రాజ‌ధాని ప‌రిణామాల‌ను ఏక‌రువు పెట్టేందుకు త‌నంత‌ట తానే ప‌వ‌న్ వెళ్లాడ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు అనుకున్న ప్ర‌జ‌ల‌కు ఈ వార్త‌లు సంచ‌ల‌నం కాక మ‌రేంటి?

 

ప్ర‌స్తుతం ఒక్క స్థానం లోనూ త‌న స‌త్తా చాట‌ని బీజేపీ, త‌న‌కున్న 4 స్థానాల‌ను పోగొట్టుకున్న బీజేపీ ఇప్పుడు ప‌వ‌న్‌తో క‌లిసి రాష్ట్రంలో ప్ర‌భంజ‌నం సృష్టించేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ట‌.. కాదు కాదు.. ప్ర‌భంజ‌న‌మే సృష్టిస్తోంద‌ట‌! ఇదీ స‌ద‌రు మీడియా క‌థ‌నాల సారాంశం. దీంతో రాష్ట్రంలో అనూహ్య చ‌ర్చ‌కు తెర‌లేచిన‌ట్ట‌యింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు చాలా స‌మ‌యం ఉంది. అయి తే, ఈలోగా స్థానికంగా త‌మ స‌త్తా చాటాల‌ని ఈ రెండు పార్టీల నాయ‌కులు నిర్ణ‌యించార‌ని చెబుతున్నారు.

 

వాస్త‌వానికి క్షేత్ర‌స్తాయి బ‌లాన్నిభేరీజువేసుకుంటే.. బీజేపీ, జ‌న‌సేన రెండూ కూడా దొందు దొందే! గ‌త ఎన్నిక‌ల్లో ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది. పోనీ.. ఈ ఏడు మాసాల‌లో ఏమైనా పుంజుకున్నారా? అంటే.. ప‌స‌లేని విమ‌ర్శ‌ల‌తో ప‌వ‌న్‌.. ప‌ట్టు లేని నాయ‌క‌త్వంతో బీజేపీ కుంగి కృశించిపోయార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి ఈ నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రు జోగులు రాసుకుంటే.. రాలేది ఓట్లా? మ‌రేమిటా?; అనేది ప్ర‌త్యేకంగా చెప్పాలా? అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా రాష్ట్రంలో ఓ ప‌స‌లేని నాయ‌కుడు, ఓ ప‌ట్టులేని పార్టీ ప్ర‌యాణం ప్రారంభం కానుంది! మ‌రి ప్ర‌జ‌లు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: