ఏ దేశంలో అయినా ప్రజల ఆర్థిక వృద్ధికి ఊతం రవాణా వ్యవస్థే. పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకు ప్రజలు వచ్చి వ్యాపారాలు చేయాలన్నా.. అభివృద్ధి చెందాలన్నా.. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలన్నా కూడా ప్రజారవాణా సక్రమంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజారవాణా ఎలా ఉన్నదో చూస్తే.. ప్రజల అభివృద్ధి ఎలా ఉందో చెప్పొచ్చని అంటారు ఆర్థిక శాస్త్ర నిపుణులు. మన దేశంలో ఎన్నో ప్రజా రవాణా సాధనాలు వచ్చినా.. ఇప్పటికీ..రైల్వేలకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. పెరుగుతున్న జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ.. వారికి ప్రజారవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వాలు ఈ విషయంలో పూర్తిగా వెనుకబడుతున్నాయి.
ఏపీలో అనేక ప్రధాన జిల్లాలకు ఇప్పటికీ సరైన రైల్వే వ్యవస్థలేక పోవడం గమనార్హం. నిజానికి 2014కు ముందు మన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అనేక ప్రాజెక్టులకు రైల్వే శంకు స్థాపనలు చేసింది. వీటిలో చి న్న, పెద్దతరహా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అయితే, ప్రభుత్వాలు మారిపోవడంతో ఆయా ప్రాజెక్టులు వె నుకబడి పోతున్నాయి. దీంతో రైల్వే వ్యవస్థ ప్రజలకు ఇంకా చేరువ కాలేక పోతోందని, సంతృప్తికర స్థాయి లో సేవలు అందించలేక పోతోందని నిపుణులు భావిస్తున్నారు. మన ఏపీలో కొన్ని ప్రాజెక్టులు శంకుస్థాప నకే పరిమితమయ్యాయి. ఇలాంటి వాటిలో కొన్ని..
మూడు దశాబ్దాల తర్వాత నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వేలైన్ అందుబాటులోకి వచ్చినా కొత్తరైళ్లు జిల్లా వైపు కన్నెత్తి చూడటంలేదు. కడప, రాజంపేట, నందలూరు, ఎర్రగుంట్ల, రైల్వేకోడూరు రైల్వేస్టేషన్లలో మౌలిక వసతులు అంతంత మాత్రంగా ఉన్నాయి. పలురైళ్లు జిల్లాలో ఆగకుండానే వెళుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడు రాజధానికి లింక్గా డీఎంయు రైళ్లను నడిపించాల్సిన అవసరముందనేది దీర్ఘకాలిక కోరిక. అదీ నెరవేరడం లేదు. వీక్లీ, బైవీక్లీ లాంటి రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలన్న వినతులు రైల్వే ఉన్నతాధికారులు పెడచెవిన పెడుతున్నారు. రాజంపేట, రైల్వేకోడూరులో ఆర్యూబీలునిర్మాణంలో జాప్యం కొనసాగుతోంది.
నందలూరు రైల్వేకేంద్రంలో ప్రత్యామ్నాయ రైల్వేపరిశ్రమ ఏర్పాటు కలగానే మిగిలింది. మోడీ హయాం లో ఇది కార్యరూపం దాల్చుతుందని జిల్లా వాసులు ఆశించారు. కేంద్రంలో ప్రభు త్వాలేవి మారినా ఈ పరిశ్రమ ఊసెత్తడంలేదు. నందలూరులో రైల్వేపరిశ్రమ ఏర్పాటుచేయాలని కొన్నేళ్లుగా నానుతున్న విషయం. రాజంపేట ఎంపీ మిధునరెడ్డి లోక్సభలో దీనిపై ప్రస్తావించారు. 250 క్వార్టర్స్తో పాటు 150 ఎకరాలు రైల్వేభూమి ఉంది. భూమి విషయంలో ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. గతంలో రైల్వేమంత్రిగా పనిచేసిన లాలు ప్రసాద్యాదవ్ వ్యాగన్ రిపేరువర్క్షాపు పెడతామని ప్రకటించారు. కానీ తర్వాత విస్మరించారు.
కడప, నెల్లూరు జిల్లాలను కలిపే కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వేలైన్ సరకు రవాణకే పరిమితమైంది. ప్రయాణీకులకు ఈ మార్గంలో వెళ్లే అవకాశం లెేదు. ఈ రైల్వేలైన్కు ఇప్పటి వరకు రూ.1186కోట్లు ఖర్చు చేశారు. ఇది కూడా అంచనా రూ.1646కోట్లకు చేరుకుంది. వెంకటాచలం–ఓబులవారిపల్లె మధ్య మార్గం పూర్తయి గూడ్స్రైళ్లకే పరిమితమైంది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడైనా మారుతుందా? లేక మరో దశాబ్దకాలం పడుతుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రస్తుతం వైసీపీకి లోక్సభలోనే ఏకంగా 22 మంది ఎంపీలు ఉండడంతో పాటు రాజ్యసభలోనూ ఆ పార్టీకి భవిష్యత్తులో తిరుగులేని బలం ఉండడంతో మరి సీఎం జగన్మోహన్రెడ్డి ఈ ప్రాజెక్టుల విషయంలో ఏం చేసి పూర్తి చేస్తారో ? కేంద్రాన్ని ఎలా ఒప్పిస్తారో ? చూడాలి.