కరోనా గండం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బయట పడేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తూ కరోనా మరింత వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతు న్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ను సమర్థవంతంగా అమలయ్యేలా చూస్తున్నారు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటూ యంత్రాంగంలో నిర్లక్ష్యం ఆవహించకుండా చూస్తున్నారు. ఒకవైపు ప్రజారోగ్యం రక్షించేందుకు విశేష కృషి చేస్తూనే ప్రజలను గడప దాటనివ్వకుండా నిత్యావసరాలను సమకూర్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ఖజనా వట్టిపోవడంతో మోదీని సమయానుకూలంగా సాయం అడిగి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరిగేలా చేస్తున్నారు.
ఇక జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వలంటీర్ విధానానికి జనాల నుంచి మంచి సహకారం లభిస్తోంది. రాజకీయాలకు అతీతంగా మద్దతు లభిస్తోంది. ఈ పద్ధతిలో పేదలకు నిత్యావసర వస్తువులు సక్రమంగా అందడంతో పాటు కరోనా లక్షణాలను గుర్తించి వారిని ఆస్పత్రులకు తరలించేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో పనిచేస్తుండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లోని ఈ విధానం ఇప్పుడు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల్లో కూడా అమలు చేస్తుండటం సీఎం ప్రతిభకు నిదర్శనమనే చెప్పాలి. ఇదిలా ఉండగాఆంధ్రప్రదేశ్ కరోనా రోజు రోజుకీ తన విసృతిని పెంచుకుంటోంది. నిన్న ఉదయం 11 గంటలకి 180కి చేరిన కరోనా కేసులు నేటి మధ్యాహ్నానికి 226కి పెరిగాయి.
ఢిల్లీ వెళ్లి వచ్చిన వారికి, వారి సంబంధీకులకు సోకుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై ఒక నిర్ణయానికి వచ్చినట్టే తెలుస్తోంది.ఇప్పటి వరకు తబ్లీగి జమాత్ ప్రతినిధులు వారి సంబంధీకులకు సంబంధించి 169కి పైగా కేసులు నమోదు కావడం విశేషం. దీంతో రాష్ట్రంలో ఇంకెంతమంది కరోనా బారిన పడతారోనన్న ఆందోళన పెరుగుతోంది. కర్నూలులో 7, చిత్తూరు జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. ఒంగోలు నెల్లూరు జిల్లాల్లో రెండేసి కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో అనంతపూర్లో 3, చిత్తూరు 17, తూర్పుగోదావరి 11, గుంటూరు 30, కడప 23, కృష్ణా 28, కర్నూలు 27, నెల్లూరు 34, ప్రకాశం 23, పశ్చిమగోదావరి, విశాఖపట్టణం జిల్లాలో 15 చొప్పున కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 226 కేసులు నమోదయ్యాయి.