ఎట్టకేలకు ఏపీ సీఎం జగన్ తన పంతం నెగ్గించుకున్నారు. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ జగన్ సర్కారు జీవో జారీ చేసింది. ఆయన్ను తొలగించేందుకు ఏకంగా ఎస్‌ ఈసీ నిబంధనల్లోనే మార్పులు తెస్తూ జగన్ సర్కారు ఆర్డినెన్స్ తెచ్చేసింది. ఆ ఆర్డినెన్సుకు గవర్నర్‌ తో ఆమోద ముద్ర వేయించుకుని.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పించింది.

 

 

జగన్ సర్కారు నిమ్మగడ్డను తొలగించింది. తన అధికారం ఉపయోగించింది. ఇంత వరకూ బాగానే ఉంది. మరి ఈ నిర్ణయం ఎంత వరకూ చెల్లుతుంది. నిమ్మగడ్డ న్యాయ పోరాటం చేస్తే పరిస్థితి ఏంటి.. ఏ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామక నిబంధనలను సవరించే హక్కు రాష్ట్రాలకు ఉంటుంది. అందులో సందేహం లేదు. కానీ.. నిమ్మగడ్డ ను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ ఏకంగా నిబంధనలు మార్చడాన్ని కోర్టులు ఆమోదిస్తాయా..?

 

 

జగన్ సర్కారు ఇప్పటికే అనేక అంశాల్లో దూకుడుగా వెళ్లి కోర్టుల్లో మొట్టికాయలు తిన్నది. ఇప్పుడు మరోసారి అదే దూకుడు ప్రదర్శించి కోర్టుల్లో దెబ్బ తినబోతోందా.. అంటే దెబ్బ తినే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో ఎన్నికల వ్యవస్థను స్వయం ప్రతిపత్తి సంస్థగా ఏర్పాటు చేశారు. దానిపై అధికారంలో ఉన్నవారి కోపతాపాలు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

 

 

మరి ఇక్కడ జగన్ సర్కారు నిమ్మగడ్డపై ప్రత్యేకమైన కోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్టాబ్లిష్ అవుతోంది. అందులోనూ నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేయడాన్ని కూడా కోర్టులు సమర్థించాయి. అలాంటప్పడు.. నిమ్మగడ్డ మరోసారి కోర్టుల ముందు తన వాదన వినిపించే అవకాశం ఉంది. ఆ వాదనలో బలం కూడా ఉంటుంది. ఇప్పటికే పలుసార్లు కోర్టుల్లో దెబ్బ తిన్న జగన్ మరోసారి ఇలాంటి దూకుడు ప్రదర్శించడం ఆయన దుందుడుకు మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది. నిమ్మగడ్డ న్యాయపోరాటం చేస్తారా..లేక అస్త్ర సన్యాసం చేస్తారా.. ఆయన్ను తెలుగు దేశం ఎంత మేరకు వెనకేసుకొస్తుందన్నది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: