కరోనా వైరస్‌ సెగ తెలుగు మీడియాకి గట్టిగానే తాకినట్లు కన్పిస్తోంది. వాస్త‌వంగా చూస్తే ఏపీలో గ‌త యేడాది ఎన్నిక‌లు అయిపోయాక వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచే తెలుగు మీడియాలో చాలా పేప‌ర్లు, ఛానెల్స్‌కు ప్ర‌క‌ట‌న‌లు త‌గ్గిపోయాయి. అప్ప‌టి నుంచి ఖ‌ర్చులు ఎలా త‌గ్గించుకోవాలా ? అని ఎదురు చూస్తోన్న చాలా మీడియా సంస్థ‌ల‌కు క‌రోనా ఓ వ‌రంలా క‌లిసొచ్చింది. క‌రోనా బూచీని సాకుగా చూపించి ప‌లు మీడియా సంస్థ‌లు త‌మ సంస్థ‌ల్లో ప‌నిచేసే సీనియ‌ర్ ఉద్యోగుల‌ను సైతం నిర్దాక్షిణ్యంగా త‌ప్పించేస్తున్నాయి. ఓ ప్ర‌ముఖ ద‌మ్మ‌న్న పేప‌ర్ అని చెప్పుకునే సంస్థ‌లో అయితే త‌ప్పించిన ఉద్యోగుల‌కు కేవ‌లం రెండు నెల‌ల పాటు 25 శాతం జీతం మాత్ర‌మే ఇస్తాం.. త‌ర్వాత అవ‌స‌రం ఉంటే పిలుస్తాం.. లేక‌పోతే మీ దారి మీరు చూసుకోండి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 

ఈ ద‌మ్మున్న మీడియాలో ఒక్కో జిల్లాలో క‌నీసం అన్ని విభాగాలు క‌లిపితే ఏకంగా 20 మంది వ‌ర‌కు ఉద్యోగుల‌ను త‌ప్పించేస్తున్నారు. మ‌రో ప్ర‌ముఖ మీడియా సంస్థ అయితే త‌మ ఉద్యోగుల‌కు ఇచ్చే ఇంక్రిమెంట్లు ఆపేసి 20 శాతం వరకు వేతనాల్లో కోత విధించింది. ఇందుకు ప్ర‌ధాన కారణం, మీడియా సంస్థలకి ప్రకటనల ద్వారా వచ్చే రెవెన్యూ గణనీయంగా తగ్గిపోవడమే.అయితే వ‌ర్క్ ఫ్రం హోం చేస్తోన్న వారికి ఇప్ప‌టి వ‌ర‌కు వేత‌నాల్లో కోత లేక‌పోయినా మున్ముందు ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే వారి వేత‌నాల్లో కూడా భారీ కోత‌లు త‌ప్ప‌వంటున్నారు.

 

ఇక ఇప్ప‌టికే అన్ని పేప‌ర్లు టాబ్లాయిడ్స్ ఎత్తేసి... జిల్లా వార్త‌ల‌ను కూడా మెయిర్ పేప‌ర్ల‌లో క‌లిపేశాయి. వీటి కోసం ప‌నిచేసే వారిని నిర్దాక్షిణ్యంగా తొల‌గించేస్తున్నారు. ఇక ఎలక్ట్రానిక్‌ మీడియా విషయానికొస్తే.. ఇక్కడా కరోనా సెగ తప్పడంలేదట. అయితే, కష్ట కాలంలో ప్రాణాలకు తెగించి బాధ్యతలు నిర్వహిస్తున్న వీళ్ల వేత‌నాల్లో కూడా కోత‌లు పెట్టేస్తుండ‌డాన్ని జ‌ర్న‌లిస్టులు త‌ట్టుకోలేక పోతున్నారు. ఓ వైపు క‌రోనా ఉన్నా కూడా ప్రాణాలు ప‌ణంగా పెట్టి పోరాటం చేస్తోన్న త‌మ‌ను కూడా అంద‌రితో క‌లిపేసి వేత‌నాలు కోసేయ‌డం ఏంట‌ని గ‌గ్గోలు పెడుతున్నారు. 

 

ఇక 20 రోజుల లాక్‌డౌన్‌కే ఈ ప‌రిస్థితి ఉంటే.. ఇదే లాక్‌డౌన్ భ‌విష్య‌త్తులో  మ‌రో నెల రోజులు కంటిన్యూ అయితే మీడియా సంక్షోభం క‌నిష్టంగా యేడాది.. గ‌రిష్టంగా మూడేళ్ల పాటు ఉంటుంద‌ని అంద‌రూ అంచ‌నా వేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: